గేట్లు సిద్ధం.. తుంగ‘భద్రం’

Must read

25న కొత్తగేట్లు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలకు వర ప్రదాయిని అయిన తుంగభద్ర ప్రాజెక్టు ఇప్పుడు కొత్తగేట్ల అమరికతో సరికొత్త రూపును సంతరించుకుంది. రూ.51 కోట్ల వ్యయంతో మొత్తం 33 గేట్ల ఏర్పాటు పనులు పూర్తికాగా, వీటిని ఈ నెల 25వ తేదీన కర్నాటక ముఖ్యమంత్రి శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి సీఆర్ పాటిల్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు.

73 ఏళ్ల క్రితం నిర్మించిన తుంగభద్ర ప్రాజెక్టు రెండు రాష్ట్రాల్లో లక్షల ఎకరాల ఆయకట్టుకు జీవనాడిగా నిలుస్తోంది. అయితే 2024 ఆగస్టులో వచ్చిన వరద ప్రవాహానికి 19వ గేటు కొట్టుకుపోయింది. అప్పటికప్పుడు నీటి వృధాను అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వ చొరవతో, సీఎం చంద్రబాబు సూచనతో సీనియర్ ఇంజనీర్ కన్నయ్య నాయుడు నేతృత్వం వహించి స్టాప్‌లాక్ గేటును అమర్చారు. స్పిల్ వే గేట్లు అన్నీ మార్చాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(NDSA) నివేదిక ఇవ్వడంతో 6 నెలల్లో కొత్తగేట్లను పూర్తి చేసి ఏపీ-కర్నాటక రాష్ట్రాలు పునరుజ్జీవం పోశాయి.

ఈ ఘటన అనంతరం ప్రాజెక్టు భద్రతపై సమగ్ర పరిశీలన చేపట్టిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) కీలక సూచనలు చేసింది. డ్యామ్‌లోని అన్ని స్పిల్‌వే గేట్లను దశలవారీగా మార్చాల్సిన అవసరం ఉందని నివేదికలో పేర్కొంది. ఈ సూచనల ఆధారంగా ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చర్యలు చేపట్టి గేట్ల మార్పిడి పనులను యుద్ధప్రాతిపదికన ప్రారంభించాయి.

సాధారణంగా ఇలాంటి భారీ పనులు పూర్తవ్వడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉన్నప్పటికీ, ఇంజినీరింగ్ నిపుణులు, అధికారులు, సాంకేతిక సిబ్బంది సమన్వయంతో కేవలం ఆరు నెలల వ్యవధిలోనే మొత్తం 33 గేట్ల మార్పిడి పనులను విజయవంతంగా పూర్తి చేశారు. ఆధునిక సాంకేతికతతో రూపొందించిన కొత్త గేట్లు భవిష్యత్తులో వరదల సమయంలో మరింత సమర్థవంతంగా పనిచేసేలా రూపొందించబడ్డాయి.

ఈ ఆధునీకరణతో డ్యామ్ భద్రత పెరగడమే కాకుండా, నీటి నిల్వ సామర్థ్యాన్ని సమర్థవంతంగా నిర్వహించే అవకాశం ఏర్పడింది. రైతులకు సాగునీటి సరఫరా మరింత స్థిరంగా ఉండటంతో పాటు, వరదల సమయంలో నీటి విడుదల కూడా శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించేందుకు వీలు కలుగుతుంది.

తుంగభద్ర ప్రాజెక్టు ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు, వందల గ్రామాలకు తాగునీరుతో ఏపీ, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలకు కీలకంగా ఉంది. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే తుంగభద్ర ప్రాజెక్టు కింద 1.46 లక్షల హెక్టార్లకు సాగునీరు అందుతోంది. కుడి కాలువ ద్వారా కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకు సాగు నీరందుతోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు భద్రతను ఏపీ-కర్నాటక రాష్ట్రాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని గేట్ల ఏర్పాటును త్వరితగతిన పూర్తి చేశాయి. 25వ తేదీన గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని హోస్‌పేటలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!