పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశ ప్రజలు పొదుపు పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన పిలుపుపై జ్యోతిష్ పీఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు నీతులు చెప్పే ముందు పాలకులు స్వయంగా ఆచరించి చూపించాలని హితవు పలికారు.
ఉత్తరప్రదేశ్లోని సోన్భద్రలో నిర్వహిస్తున్న తన ‘గోవిష్ఠ యాత్ర’లో భాగంగా మీడియాతో మాట్లాడిన శంకరాచార్య స్వామి.. కేంద్ర ప్రభుత్వ వ్యయ విధానాలపై కూడా విమర్శలు గుప్పించారు.
“ముందు రూ.8,000 కోట్ల విమానం అమ్మండి” ప్రధాని మోదీ ప్రజలకు పొదుపు చేయాలని సూచించడం సరే కానీ, ముందుగా ప్రభుత్వం కూడా ఖర్చులను తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలని అవిముక్తేశ్వరానంద అన్నారు.
“ముందుగా ప్రభుత్వం తమ వద్ద ఉన్న రూ.8,000 కోట్ల విలువైన విమానాన్ని అమ్మి, ఇంధన సామర్థ్యం ఎక్కువగా ఉన్న సాధారణ విమానాన్ని ఉపయోగించాలి. ధర్మం ఎప్పుడూ మన ఇంటి నుంచే ప్రారంభం కావాలి” అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఈ పరిస్థితుల్లో దేశ ప్రజలు అవసరం లేని ఖర్చులను తగ్గించాలని ప్రధాని మోదీ సూచించినట్లు తెలుస్తోంది. ప్రత్యేకంగా బంగారం కొనుగోళ్లు తగ్గించడం, విదేశీ ప్రయాణాలను పరిమితం చేయడం, ఇంధన వినియోగంలో జాగ్రత్తలు పాటించడం వంటి అంశాలపై ప్రజలకు ప్రధాని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.
శంకరాచార్య వ్యాఖ్యలలో ప్రధానంగా ప్రభుత్వ వ్యయ విధానాలపై విమర్శ కనిపించింది. సాధారణ ప్రజలకు మాత్రమే పొదుపు సూచనలు చేయకుండా, ప్రభుత్వాలు కూడా విలాసవంతమైన ఖర్చులను తగ్గించుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. “ప్రజలపై మాత్రమే భారం వేయడం సరైంది కాదు. నాయకులు, ప్రభుత్వాలు కూడా ఆదర్శంగా నిలవాలి” అని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.





