దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన నీట్ యూజీ 2026 ప్రవేశ పరీక్షపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మే 3న నిర్వహించిన నీట్ యూజీ 2026 పరీక్షను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఎన్టీఏ)అధికారికంగా ప్రకటించింది. పరీక్షను మళ్లీ నిర్వహించనున్నట్లు వెల్లడిస్తూ, కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని స్పష్టం చేసింది.
ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది. ముఖ్యంగా పరీక్షలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు రావడంతో కేంద్ర ప్రభుత్వం అత్యవసరంగా జోక్యం చేసుకుంది.
నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీ, అనుమానాస్పద మార్కులు, నిర్వహణలో లోపాలపై ఫిర్యాదులు రావడంతో వివాదం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో మే 8న ఈ అంశాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థల దృష్టికి తీసుకెళ్లినట్లు ఎన్టీఏ వెల్లడించింది. కేంద్ర ఏజెన్సీలు, లా ఎన్ఫోర్స్మెంట్ అధికారుల నుంచి వచ్చిన ప్రాథమిక నివేదికల ఆధారంగా పరీక్ష విశ్వసనీయతపై తీవ్రమైన అనుమానాలు వ్యక్తమైనట్లు తెలిపింది.
ఎన్టీఏ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, పరీక్ష నిర్వహణ ప్రక్రియ సమగ్రతను కాపాడలేమనే నిర్ణయానికి వచ్చిన తర్వాతే పరీక్షను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.“జాతీయ స్థాయి పరీక్షలపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నమ్మకం నిలబెట్టడం అత్యంత ముఖ్యమైన విషయం. అందుకే కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది” అని ఎన్టీఏ పేర్కొంది.
ఈ కేసును కేంద్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. పరీక్షలో జరిగినట్లు భావిస్తున్న అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఆదేశాలు జారీ చేసింది. ఎన్టీఏ కూడా దర్యాప్తుకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని వెల్లడించింది. పరీక్ష నిర్వహణకు సంబంధించిన అన్ని రికార్డులు, డిజిటల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్, సర్వర్ వివరాలు సీబీఐకి అందజేస్తామని పేర్కొంది.
“మళ్లీ చదవాలి, మళ్లీ పరీక్ష రాయాలి అంటే చాలా కష్టం. కానీ పారదర్శక పరీక్ష కోసం ఇదే మార్గమైతే అంగీకరించాల్సిందే” అని కొందరు విద్యార్థులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నీట్ యూజీ 2026 రద్దు దేశ విద్యా వ్యవస్థపై మరోసారి పెద్ద చర్చకు దారితీసింది.





