సింగిల్ పోర్టల్ ద్వారా అనుమతులు : నారా లోకేష్​

Must read

రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం, కిరాణా కొట్టు నుంచి డేటా సెంటర్ వరకు సింగిల్ పోర్టల్ ద్వారా అనుమతులు మంజూరు చేసే విధానాన్ని రూపొందించాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులకు ఆదేశించారు. రాష్ట్రంలో 20లక్షల ఉద్యోగాల కల్పనకు మంత్రి లోకేష్ నేతృత్వంలో ఏర్పాటైన మంత్రుల బృందం సమావేశం ఉండవల్లి నివాసంలో నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, కందుల దుర్గేష్, టీజీ భరత్ (ఆన్ లైన్ ద్వారా) హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకువచ్చిన 750 భారీ పరిశ్రమలు వివిధ దశల్లో ఉన్నాయి, ఇవి పూర్తిస్థాయిలో పట్టాలెక్కితే పెద్దఎత్తున రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి, సాధ్యమైనంత త్వరగా ఆయా పరిశ్రమలు గ్రౌండింగ్ అయ్యేలా పరిశ్రమల శాఖ, ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు అధికారులు ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ప్రత్యేకశ్రద్ధ వహించాలని అన్నారు. పనులను వేగవంతంచేసి ప్రతినెలా ప్రాజెక్టుల భూమిపూజ, ప్రారంభోత్సవాలు ఉండేలా అధికారులు చొరవచూపాలని కోరారు.

నవంబర్ లో నిర్వహించే పార్టనర్ షిప్ సమ్మిట్ నాటికి సాధ్యమైనంత గరిష్టంగా పరిశ్రమలు గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. గత సమ్మిట్ కి మించి ఈసారి పెద్దసంఖ్యలో రాష్ట్రానికి పరిశ్రమలను ఆకర్షించేలా విదేశాలతోపాటు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున రోడ్ షోల నిర్వహణకు ప్రణాళికలు రూపొందించాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. గత నెలరోజుల వ్యవధిలో 210 భారీ పరిశ్రమలు తర్వాత దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు.

ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ కు సంబంధించిన 26 ప్రాజెక్టుల పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రాజెక్టుల పురోగతికి సంబంధించి ప్రతి 15రోజులకోసారి కలెక్టర్లు, జిల్లాస్థాయి అధికారులతో రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు సమీక్షించాలని మంత్రి లోకేష్ కోరారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఆయా పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన పవర్, వాటర్, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టిసారించాలని సూచించారు.

రాష్ట్రంలో భారీగా విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో వివిధ స్టేజిల్లో ఉన్న రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భారీ పరిశ్రమలతోపాటు రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటవుతున్న ఎంఎస్ఎంఈలను కూడా ఆన్ బోర్డు చేయాలని అన్నారు. త్వరలో భోగాపురం ఎయిర్ పోర్టు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో విశాఖపట్నంలో సాధ్యమైనంత ఎక్కువగా హోటల్ గదులు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపట్టాలని పర్యాటకశాఖ అధికారులకు సూచించారు.

స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ మన ప్రభుత్వ ప్రత్యేకతలు, సులభతరమైన సర్వీస్ డెలివరీ అందించాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. రాష్ట్రంలో గార్మెంట్ పరిశ్రమలను ఆకర్షించడానికి చేపట్టాల్సిన చర్యలు, అందించాల్సిన ప్రోత్సాహకాలపై సమావేశంలో చర్చించారు. ఎంప్లాయ్ మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అందించే అంశాన్ని పరిశీలించాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న టెక్స్ టైల్ పరిశ్రమలు క్యాప్టివ్ పవర్ ఉత్పత్తి చేసుకునేందుకు ఏడాదిపాటు బ్యాంకింగ్ ఫెసిలిటీ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని అన్నారు.

అనకాపల్లి – విశాఖ – విజయనగరం జిల్లాలు స్టీల్ హబ్ గా ఆవిష్కృతమవుతున్న నేపథ్యంలో కొత్తగా రాష్ట్రానికి వచ్చేందుకు మరికొన్ని ఉక్కు పరిశ్రమలు ఆసక్తిచూపుతున్నాయి, ఇందులో ప్రధానమైన ముడిసరుకు సరఫరా కోసం స్లరీ పైప్ లైన్ కావాలని ఆయా సంస్థలు కోరుతున్నాయి, దీనిపై అధికారులు అధ్యయనం చేయాల్సిందిగా మంత్రి లోకేష్ సూచించారు.

ఈ సమావేశంలో రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్, ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్, పంచాయితీరాజ్, రూరల్ డెవలప్ మెంట్ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, టూరిజం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు సీఈవో షన్మోహన్, స్కిల్ డెవలప్ మెంట్ డైరెక్టర్ గణేష్ కుమార్, ఏపీఐఐసీ ఎండీ ఏఎస్ దినేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!