శనివారం వీక్షణం 164వ సమావేశం జరిగింది. ఉదయం 6 గంటల 30 నిమిషాల నుండి మూడు గంటలు సాగిన ఈ సమావేశం ఎంతో ఉత్సాహంగా సాగింది. వీక్షణం వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ గీతామాధవి కవితా ప్రియులకు స్వాగతం పలికారు.
ప్రముఖ కవయిత్రి డాక్టర్ కొండపల్లి నీహారిణి గీత మాధవిని పరిచయం చేసి వారి కధాపఠనం చేయవలసినదిగా ఆహ్వానించారు. గీతా మాధవి ఈ మధ్యనే ప్రతిష్టాత్మక వంగూరి ఫౌండేషను పురస్కారం పొందిన అటానమస్ ఏజంట్ అనే కథను భార్యా భర్తల సంవాదంగా చక్కగా హావభావాలతో వినిపించి సభికులను ఆకట్టుకున్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెల్లిజెన్స్ (కృత్తిమ మేధస్సు) గురించి చక్కగా వివరించి అందరి మన్ననలను పొందారు. డాక్టర్ కొండపల్లి నీహారిణి కధను సమీక్షించి కధ అద్భుతముగా ఉందని, చదవటం హృద్యంగా ఉందని అభినందించారు. పిమ్మట వీక్షణం భారతీయ ప్రతినిధి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, కావలి కవి రామాయణం ప్రసాదరావు మంచికవితను వినిపించినందుకు డాక్టర్ గీతకు హార్ధిక అభినందనలు తెలిపారు.
పిమ్మట గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ మరియు బిటవరం శ్రీమన్నారాయణ కలసి కవిసమ్మేళనం అద్భుతంగా నిర్వహించారు. గీతా మాధవి ఓ చిట్టి తల్లి.. చిన్నారి తూనీగా అంటూ భావాత్మక, కవితాత్మక కవితను చక్కగా చదివారు. అరుణ కీర్తి పతాకరెడ్డి ఓ చక్కని గేయాన్ని, గంటా మనోహరరెడ్డి ఘంటారావం అనే కవితను, అయ్యల సోమయాజుల ప్రసాద్ ధర్మపత్ని , తనయ గురించి, రామాయణం ప్రసాదరావు ఆమే అలక అనే హాస్య కవితను, మోటూరి నారాయణరావు ‘ఓ చిరు ఆశ – అదే నా శ్వాస ‘ అనే కవితను, బిటవరం శ్రీమన్నారాయణ వింత వ్యాపారం అనే కవితను చక్కగా వినిపించారు.
పిమ్మట డాక్టర్ చీదెళ్ళ సీతాలక్ష్మి వేగానికి కళ్ళెం అనే తన స్వీయ అనుభవాన్ని, పరిమి వెంకట సత్యమూర్తి కందుకూరి వీరేశలింగం పై కవితను, ఉప్పలపాటి వెంకటరత్నం యుద్ధము – శాంతి అనే కవితను, పరాంకుశం క్రిష్ణవేణి స్వేచ్ఛా మైదానం అనే కవితను, డాక్టర్ బలుసాని వనజ కాలంతోనే నే కలసి సాగనా అనే కవితను, డాక్టర్ బృందా ఆరోగ్యం పై కవితను నాళేశ్వరం శంకరం చెమట పూసలు కవితను, గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ ఓ అక్షర సైనికా అనే కవితను చక్కగా చదివి పాల్గొన్న వారిని అందరినీ అలరించారు.
వీక్షణం భారతీయ ప్రతినిధి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ సమావేశంలో పాల్గొని అద్భుతమైన కవితలను వినిపించి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పాల్గొన్న కవులు అందరికి ధన్యవాదాలు తెలిపారు.
డాక్టర్ గీతా మాధవి నిర్వాహకులతో సహకరించి చక్కని కవితలు ఆలపించిన కవులకు ధన్యవాదాలు చెప్పి కార్యక్రమాన్ని ముగించారు. మంచి సాహిత్య కారక్రమం ఏర్పాటుచేసినందుకు పాల్గొన్న సాహితీ ప్రియులు సంతోషం వ్యక్తపరిచారు.గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం, వీక్షణం భారతీయ ప్రతినిధి.





