పార్లమెంట్లో అమరావతి రాజధాని బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో, రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేస్తూ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో రాజధాని అమరావతి గురించి చేసిన వ్యాఖ్యలను విడుదల చేశారు. అమరావతిపై జగన్ మాట్లాడిన మాటలు చూస్తే ఆయన మానసిక పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోందని విమర్శించారు.
ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో అమరావతిని అంగీకరించిన జగన్, అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకువచ్చారని గంటా ఆరోపించారు. అమరావతి తీర్మానంపై నిర్వహించిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశానికి కూడా ఆయన హాజరుకాలేదని పేర్కొన్నారు.
పార్లమెంట్లో అమరావతికి వ్యతిరేకంగా ఉన్న ఏకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని గంటా వ్యాఖ్యానించారు. జగన్ వ్యాఖ్యల్లో స్థిరత్వం లేదని, ఒకప్పుడు ఉత్తరాంధ్ర గురించి మాట్లాడిన ఆయన ఇప్పుడు భిన్నంగా వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.వైసీపీకి ఒకప్పుడు 151 సీట్లు వచ్చినా, ప్రస్తుతం 11 సీట్లకు పడిపోయిందని ప్రజలు ఇచ్చిన తీర్పును గుర్తుచేశారు. అయినప్పటికీ జగన్ తన వైఖరిలో మార్పు చూపడం లేదని గంటా ఆరోపించారు.
అమరావతి అభివృద్ధిపై కూడా గంటా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 15వ తేదీలోపు గూగుల్ శంకుస్థాపన జరిగే అవకాశం ఉందని తెలిపారు. అమరావతిని కలల రాజధానిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.గత ప్రభుత్వ కాలంలో అమరావతి రైతులు, ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేస్తూ, ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయని చెప్పారు. రాష్ట్రపతి ఆమోదం లభించిన తర్వాత అమరావతిని ఎవరూ కదిలించలేరని స్పష్టం చేశారు.





