అస్సాం రాష్ట్రంలో ఎన్నికల వేడి రోజురోజుకు పెరుగుతున్న వేళ, కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని మరింత వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో సీతక్క దిబ్రూగర్ జిల్లాలోని నహర్కటియా నియోజకవర్గంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ఇంటింటికీ వెళ్లిన సీతక్క, ఓటర్లను నేరుగా కలుసుకుని పార్టీ అభ్యర్థి ప్రణతీ ఫుకాన్కు భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రజలతో మమేకమవుతూ, వారి సమస్యలు తెలుసుకుంటూ ప్రచారం సాగించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సీతక్క, నహర్కటియా ప్రాంత అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గతంలో ప్రజలకు సేవలందించిన అనుభవం ఉన్న నాయకురాలు ప్రణతీ ఫుకాన్ను గెలిపిస్తే, నియోజకవర్గానికి మరింత అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు.ప్రజల సమస్యలను పరిష్కరించే శక్తి కాంగ్రెస్ పార్టీకే ఉందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్యంగా స్థానిక యువత, మహిళలు పెద్ద ఎత్తున కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి, సంక్షేమం అనే రెండు ప్రధాన లక్ష్యాలతో కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోందని తెలిపారు.
ఈ ప్రచారంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామాల వారీగా నిర్వహించిన ఈ కార్యక్రమాలు ప్రజల్లో మంచి స్పందనను తెచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ప్రస్తుతం అస్సాంలో ఎన్నికల పోటీ కఠినంగా మారుతున్న నేపథ్యంలో, జాతీయ స్థాయి నాయకులు కూడా ప్రచారంలో పాల్గొనడం గమనార్హం. సీతక్క వంటి నాయకులు ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొనడం వల్ల పార్టీకి బలం చేకూరుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.





