నందవరం మండల పరిధిలోని మాచాపురం గ్రామంలో సచివాలయం పనితీరుపై గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు సేవలు అందించాల్సిన సచివాలయం అధికారులు ప్రతిరోజూ మధ్యాహ్నం రెండు గంటలకే కార్యాలయానికి తాళాలు వేసి వెళ్లిపోతున్నారని ఆరోపిస్తున్నారు. దీనివల్ల తమ సమస్యలను చెప్పుకునేందుకు వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సాధారణంగా ప్రభుత్వ సచివాలయాలు నిర్ణీత సమయాల్లో పనిచేయాల్సి ఉండగా, మాచాపురం గ్రామ సచివాలయంలో మాత్రం అధికారులు తమకు నచ్చిన సమయానికి వచ్చి, తాము నిర్ణయించుకున్న సమయానికే వెళ్లిపోతున్నారని స్థానికులు చెబుతున్నారు. “వాళ్లు ఆడింది ఆట, పాడింది పాట” అన్నట్టుగా అధికారుల వ్యవహారం ఉందని ప్రజలు విమర్శిస్తున్నారు. “వాళ్లు చెప్పిందే వేదం” అన్నట్టుగా వ్యవహరిస్తూ ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
గ్రామస్తుల వివరాల ప్రకారం, ఏదైనా సమస్యతో సచివాలయానికి వెళ్లేటప్పుడు కాస్తా ఆలస్యం అనగా పొలం పనులు, ఇంటి పనులు చేసుకుని మధ్యాహ్నం వెల్దాం అనుకుంటే రెండు గంటలకే తాళాలు వేసి అధికారులు వెళ్లిపోతున్నారన్నారు. దీంతో సమస్యలు వినే నాదుడే కరువయ్యాడని గోడు వెల్లబుచ్చుకున్నారు. ఇదేక్కడి ఆఫీస్ టైం అనుకుని మక్కుమీద వెలేసుకుంటున్నారు.
ఈ విషయంపై గ్రామస్తులు పై అధికారుల పాత్రను కూడా ప్రశ్నిస్తున్నారు. సచివాలయంలో ఇంత జరుగుతున్నప్పటికీ స్పెషల్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని చర్చించుకుంటున్నారు. సచివాలయం సిబ్బంది నిర్లక్ష్యంపై ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని భావిస్తున్నారు.
ఈ ఘటనపై వివరాలు సేకరించినప్పుడు పంచాయతీ సెక్రటరీ ఇంటి గుత్తుల కోసం గ్రామంలోకి వెళ్లినట్లు సమాచారం. అలాగే డిజిటల్ అసిస్టెంట్, హెల్పర్ అసిస్టెంట్ సెలవులో ఉన్నారని తెలిసింది. అగ్రికల్చర్ విభాగానికి చెందిన అధికారి ఆఫీస్ పనుల కోసం వెళ్లినట్లు పేర్కొన్నారు. అయితే మిగతా సిబ్బంది ఎక్కడ ఉన్నారన్నది స్పష్టంగా తెలియకపోవడం గ్రామస్తుల్లో మరింత అనుమానాలకు తావిస్తోంది.
“సంక్రాంతి పండగకు అల్లుడు వచ్చినట్టు వచ్చి వెళ్లిపోతున్నారు” అంటూ గ్రామస్తులు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. అధికారులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించకపోవడం వల్ల ప్రజలకు నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయంపై స్పెషల్ అధికారి రామచంద్ర రావును సంప్రదించగా, ఈ ఘటనపై తనకు సమాచారం అందలేదని తెలిపారు. సచివాలయం అధికారులు ఎందుకు ముందుగానే కార్యాలయం మూసివేస్తున్నారో తెలుసుకుని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సంబంధిత సిబ్బందితో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించి త్వరలోనే స్పందిస్తామని తెలిపారు.





