నిన్న కాక మొన్న మాదాపూర్ లో ఓ యువతిని లారి లాక్కెళ్లడంతో మృతి చెందిన విషయం మరవక ముందే హైదరాబాద్ నగరంలో మరోసారి అలాంటి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని హస్తినాపురం సమీపంలోని సాగర్ రోడ్డుపై జరిగిన ఈ ఘటనలో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. డ్రైవర్ నిర్లక్ష్యం ఈ విషాదానికి కారణమైంది.
పోలీసుల వివరాల ప్రకారం, హోండా కారును నడిపిస్తున్న వ్యక్తి మద్యం మత్తులో ఉండడమే కాకుండా కారును వేగంగా డ్రైవ్ చేశాడు. ఈ క్రమంలో రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్న ఒక యువకుడిని ఢీకొట్టాడు. అదే సమయంలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న మరో ఇద్దరు యువకులను కూడా ఢీకొట్టాడు. ఢీకొట్టిన తర్వాత కూడా కారు ఆగకుండా దాదాపు 100 మీటర్ల దూరం వరకు బాధితులను ఈడ్చుకెళ్లిందని ఈ క్రమంలోనే ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు.
మృతుల్లో ఇద్దరు మహావీర్ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన విద్యార్థులు శివా, సందీప్ లున్నారు. వీరు బైక్పై వెళ్తుండగా ఈ ప్రమాదానికి గురయ్యారు. మరో వ్యక్తి రోడ్డు మీద నడుస్తూ ఉండగా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు.
ఈ ఘటనతో కాలేజీ విద్యార్థులు, మృతుల కుటుంబ సభ్యులు అగ్రహానికి లోనయ్యారు. సంఘటన స్థలానికి చేరుకుని వారు నిరసనకు దిగారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కొందరు విద్యార్థులు డ్రైవర్ను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఆగ్రహావేశానికి లోనయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. విద్యార్థులను సమాధానపరుస్తూ, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడా? ప్రమాదానికి దారితీసిన ఇతర కారణాలు ఏమిటి? అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది.





