యువత ఉద్యోగాల కోసం ఎదురుచూసే స్థాయిలో కాకుండా, నలుగురికి ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. నాగోల్లోని శ్రేయాస్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన ‘యువ భారత్ కాన్క్లేవ్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి పలు కీలక అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. విద్య, ఉపాధి, మహిళా సాధికారత, యువత పాత్ర, తెలంగాణ అభివృద్ధి, రాజకీయాలు వంటి అంశాలపై విద్యార్థుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో శ్రేయాస్, గీతాంజలి, మల్లారెడ్డి విద్యాసంస్థలకు చెందిన పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. యువత తమ భవిష్యత్ లక్ష్యాలపై స్పష్టమైన అవగాహనతో ముందుకు సాగాలని ఈటల సూచించారు. కేవలం ఉద్యోగాల కోసం పోటీ పడకుండా, కొత్త ఆలోచనలతో స్టార్టప్లు, పరిశ్రమలు స్థాపించి మరెందరికో ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆయన పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు పలు పథకాలు అమలు చేస్తోందని, ముఖ్యంగా ఇంక్యుబేషన్ కేంద్రాల ద్వారా యువతకు సాంకేతిక, ఆర్థిక, శిక్షణ పరమైన సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ప్రపంచ స్థాయి సంస్థలను నిర్మించే దిశగా యువత అడుగులు వేయాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక రంగాల్లో అభివృద్ధి జరిగినప్పటికీ, రాష్ట్ర సాధన సమయంలో కలలు కన్న అన్ని లక్ష్యాలు ఇంకా పూర్తిగా నెరవేరలేదని ఈటల రాజేందర్ అన్నారు. తాము ఉద్యమం ద్వారా ఎదిగిన నాయకులమని, కష్టాలు అనుభవించిన వర్గాల సమస్యలు తెలిసినవారమని పేర్కొన్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న సమయంలో పేదలు, రైతులు, వెనుకబడిన వర్గాల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేశామని గుర్తుచేశారు.
కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రజలకు ధైర్యం చెప్పడం తన బాధ్యతగా భావించానని ఈటల తెలిపారు. పీపీఈ కిట్ ధరించి తొలి కరోనా రోగిని స్వయంగా కలిసి ధైర్యం చెప్పానని, ప్రజాప్రతినిధిగా సంక్షోభ సమయంలో నాయకత్వం అంటే ఏమిటో చూపించేందుకు ప్రయత్నించానని పేర్కొన్నారు.
దేశ అభివృద్ధిపై మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత పదేళ్లలో దేశం వేగవంతమైన అభివృద్ధి సాధించిందని ఆయన అన్నారు. గత దశాబ్దంలో మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, డిజిటల్ సేవలు, స్టార్టప్ వ్యవస్థ వంటి అనేక రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించామని పేర్కొన్నారు. భారతదేశాన్ని ప్రపంచంలో ప్రముఖ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడంలో యువత పాత్ర అత్యంత కీలకమని అన్నారు.
మహిళా సాధికారతపై కూడా ఈటల ప్రత్యేకంగా మాట్లాడారు. గతంతో పోలిస్తే నేటి యువతులు విద్య, ఉపాధి, నాయకత్వ రంగాల్లో ముందంజలో ఉన్నారని అన్నారు. మహిళలు స్వయం సమృద్ధి సాధించేందుకు కృషి చేయడం సమాజానికి మంచి సంకేతమని పేర్కొన్నారు. ముఖ్యంగా ఇంట్లో తల్లి చదువుకొని ఉంటే కుటుంబం, పిల్లల భవిష్యత్తు మరింత ఉన్నతంగా ఉంటుందని, సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర అత్యంత కీలకమని వివరించారు.
తన చిన్ననాటి అనుభవాలను విద్యార్థులతో పంచుకున్న ఈటల రాజేందర్, హుజూరాబాద్ నుంచి తల్లిదండ్రులు బస్సు లేదా రైలెక్కించి పంపితే తాను ఒంటరిగానే హైదరాబాద్కు వచ్చేవాడినని గుర్తు చేసుకున్నారు. ఆ కాలంలో చాలా మంది విద్యార్థులు స్వతంత్రంగా ప్రయాణించి తమ పనులు తామే చేసుకునేవారని చెప్పారు. ప్రస్తుతం తల్లిదండ్రులు పిల్లలను కళాశాల హాస్టల్ వరకు తీసుకెళ్తున్నారని, ఇది వారి స్వతంత్ర ఆలోచన, మానసిక దృఢత్వంపై ప్రభావం చూపే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
పిల్లలకు తగిన స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా జీవితంలో సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం పెరుగుతుందని ఆయన అన్నారు. ప్రతి చిన్న సమస్యకూ తల్లిదండ్రులపై ఆధారపడే పరిస్థితి ఉండకూడదని, అలాంటి పరిస్థితుల్లో యువత చిన్న విషయాలకే మానసికంగా కుంగిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్లో బలమైన వ్యక్తిత్వాన్ని నిర్మించాలంటే పిల్లల్లో ఆత్మవిశ్వాసం, స్వీయ నిర్ణయ సామర్థ్యాన్ని పెంపొందించాలని తల్లిదండ్రులకు సూచించారు.
యువశక్తి ఏ దేశానికైనా అతిపెద్ద సంపద అని పేర్కొన్న ఈటల రాజేందర్, విద్యార్థులు బాగా చదివి నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు తమకు అందించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.





