మన లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఎన్ని కష్టాలు ఎదురైనా, వాటిని అధిగమించి మన కలను నెరవేర్చుకునే విధంగా మనల్ని మనం దృఢపరచు కోవాలని, మనలోని అంతర్గత శక్తులను ప్రేరేపించుకుని గమ్యం వైపు అడుగులు వేయాలని దైనంపల్లి ప్రవీణ్ అన్నారు.
సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ లో విజయం సాధించడానికి ప్రిలిమ్స్ తొలిమెట్టు అయితే, అందులో వచ్చే ప్రశ్నలని సరిగా అర్థం చేసుకొని ఇచ్చిన నాలుగు ఆప్షన్స్ లోంచి సరైన సమాధానాన్ని కనుక్కోవడానికి విస్త్రుత అధ్యయనమే మార్గమన్నారు.
సిలబస్ కనుకూలంగా వివిధ పాఠ్యాంశాలను చదవడం మాత్రమే కాకుండా వాటిని సక్రమంగా గుర్తుపెట్టుకోవడం, సరైన సమయంలో వాటిని స్మరణ చేసుకోవడం అవసరమని, దీనికోసం నిరంతరం వివిధ మోడల్ టెస్టులను సాధన చేయడం ద్వారా అభ్యర్థులలో ఆత్మవిశ్వాసం, విషయ అవగాహన, పరీక్ష ప్రశ్నలని ఎదుర్కొనే వ్యూహం పెరుగుతాయని దైనంపల్లి ప్రవీణ్ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్ 1 పోటీ పరీక్షలలో విజయం సాధించి డీఎస్పీగా పోలీసుశాఖకు ఎంపికై ప్రస్తుతం అకాడమీలో శిక్షణ పొందుతూ, సివిల్ సర్వీసెస్ 2025 పరీక్షలలో మంచి ర్యాంకు సాధించి విజేతగా నేటి తెలంగాణ యువతకు ఆదర్శంగా నిలిచాడు.
మే 24 నాడు జరగబోయే సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షల దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర బీసీ స్టడీ సర్కిల్ ప్రయోగాత్మకంగా ప్రారంభించిన “సంకల్ప సాధన దీక్ష” లో భాగంగా సైదాబాద్ బీసీ స్టడీ సర్కిల్ లో ప్రవీణ్ కుమార్ ప్రసంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
ప్రిలిమినరీ పరీక్షల్లో అభ్యర్థులు పాటించాల్సిన వ్యూహం, పరీక్షను అర్థం చేసుకునే విధానం, ప్రశ్నలన్నీ
విశ్లేషించే తీరు, సమయపాలన లాంటి అంశాలపై ఆయన ఎన్నో విలువైన సూచనలు, తన అనుభవాలు, ఉదాహరణలతో సహా వివరించడం అభ్యర్థులకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది.
ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బిసి స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ మామిడి హరికృష్ణ తెలంగాణ
యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం ఒక స్వప్నం అని, అలాంటి ప్రభుత్వ ఉద్యోగాలలో శిఖరం లాంటి ఉద్యోగాలు సివిల్ సర్వీసెస్ అని, సివిల్ సర్వీసెస్ ని సాధించే కలని సాకారం చేయడంలో బిసి స్టడీ సర్కిల్ నాణ్యమైన శిక్షణ ని, విజేతలైన వ్యక్తుల మార్గదర్శకత్వంలో నిర్వహిస్తూ వస్తుందన్నారు.





