పరిగి నియోజకవర్గంలో భూసంబంధిత వివాదం రాజకీయంగా తీవ్రమవుతోంది. దళిత, గిరిజన, బలహీన వర్గాల భూములను ఇండస్ట్రియల్ పార్కుల పేరిట ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ చర్యలను ఆయన “దండయాత్ర”గా అభివర్ణిస్తూ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు గుప్పించారు.
ఎందుకు ఈ ప్రభుత్వం అంత భయపడుతున్నది.
ప్రజాస్వామ్యం అనే ఏడో గ్యారెంటీ ఇస్తున్నాం, ప్రజలకు ప్రశ్నించే హక్కు కల్పిస్తం అన్నరు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బలహీన వర్గాల గొంతుకగా మాట్లాడుతుంటే ఎందుకు అడ్డుకుంటున్నారు. మా మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డిని అరెస్టు చేసి గంటకో పోలీసు స్టేషన్ కు పంపుతున్నారు.
ఎందుకు అంత భయబ్రాంతులకు గురి చేస్తున్నారు.
పరిగి ప్రాంతంలో వేల ఎకరాల భూములను లక్ష్యంగా పెట్టుకుని నోటిఫికేషన్లు జారీ చేస్తున్నారని, ఇప్పటికే దళితులు, గిరిజనులకు చెందిన సుమారు 10 వేల ఎకరాల భూములు స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. మరో 40 వేల ఎకరాలను కూడా తీసుకునే యత్నం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ పరిణామాలు బలహీన వర్గాల జీవనాధారాన్ని దెబ్బతీస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
కళ్లాపూర్ వద్ద రైతుల సమస్యలు తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన సమావేశాన్ని పోలీసులు అడ్డుకున్నారని, టెంట్లు చింపి రైతులు, మహిళలను అరెస్టు చేశారని ఆయన వివరించారు. అక్కడికి వస్తే కేసులు పెడతామని బెదిరించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కూడా హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ఆయన పాలన అనిశ్చితంగా ఉందని, ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియని పరిస్థితి నెలకొన్నదని వ్యాఖ్యానించారు. వివిధ ప్రాజెక్టుల పేరిట భూములను స్వాధీనం చేసుకుంటూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
మూసీ ప్రాజెక్ట్, హైడ్రా చర్యలు, యూనివర్సిటీ భూములు, మార్కెట్ యార్డ్ భూములు వంటి అంశాలను ప్రస్తావిస్తూ, ప్రభుత్వం భూములపై దృష్టి కేంద్రీకరించిందని విమర్శించారు. “పాలన చేయాల్సిన ప్రభుత్వం భూముల వెంట పడుతోంది” అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇందిరమ్మ పాలనలో పేదలకు భూములు ఇచ్చారని, కానీ ఇప్పుడు అదే పేరుతో భూములు లాక్కుంటున్నారని హరీశ్ రావు అన్నారు. అసైన్డ్ భూములపై గద్దల్లా వాలుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో 22ఏ నిషేధిత జాబితాను పునఃసమీక్షించి వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా, ఇండస్ట్రియల్ పార్కుల నోటిఫికేషన్లను ఉపసంహరించుకొని పరిగి రైతులకు భూములు తిరిగి ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు.





