మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలోని పలు కాలనీలకు సంబంధించిన వక్ఫ్ బోర్డు సమస్యపై, ప్రభావిత ప్రాంతాల కాలనీ సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని ఆయన కార్యాలయంలో కలిసి తమ సమస్యలను వివరించారు.
2024 సంవత్సరంలో తెలంగాణ వక్ఫ్ బోర్డు పొరపాటున మల్కాజిగిరి పరిధిలోని సర్వే నంబర్లు 3, 103, 104, 105 మరియు 144 నుండి 154 వరకు 22-A నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో న్యూ విద్యానగర్, ఓల్డ్ నేరెడ్మెట్, రాంబ్రహ్మనగర్, దేవినగర్ ఎక్స్టెన్షన్, దేవినగర్, సైనిక్ నగర్, సీతారాం నగర్, కృష్ణా నగర్ ప్రాంతాలు కూడా ఉండడంతో, ఆ ప్రాంతాలలో ఆస్తుల కొనుగోలు-అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయాయి.
ఆంధ్రప్రదేశ్ గెజెట్ నం. 35 పార్ట్-II (27.08.1987), గెజెట్ నం. 37 పార్ట్-II (13.10.2001) ప్రతులను పరిశీలించగా, అలాగే హైకోర్టులోని C.R.P. నం. 5057/2008 కేసు ఆధారంగా, సంబంధిత సర్వే నంబర్లు మల్కాజిగిరికి కాకుండా ఉప్పల్ మండలంలోని మల్లాపూర్ గ్రామానికి చెందినవని స్పష్టమైంది.
ఈ నేపథ్యంలో కాలనీ సంఘాల విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి ఇప్పటికే రెండు సార్లు తెలంగాణ వక్ఫ్ బోర్డు ఛైర్మన్, సీఈఓలను కలిసి సమస్యపై చర్చించారు.
ఈ సమావేశంలో కాలనీ వాసులు తమ ఆందోళనలను వ్యక్తం చేయగా, ఎమ్మెల్యే స్పందిస్తూ మల్లాపూర్కు చెందిన సర్వే నంబర్లు పొరపాటున మల్కాజిగిరి పరిధిలో వక్ఫ్ జాబితాలో చేర్చబడినవని, వాటిని వెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఈ విషయమై ఇటీవల మంత్రి శ్రీధర్ బాబుని కలసి, వక్ఫ్ బోర్డు సీఈఓతో మాట్లాడించినట్లు వివరించారు.
ఈ సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే కాలనీ వాసులకు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో న్యూ విద్యానగర్, ఓల్డ్ నేరెడ్మెట్, రాంబ్రహ్మనగర్, దేవినగర్ ఎక్స్టెన్షన్, దేవినగర్, సైనిక్ నగర్, సీతారాం నగర్, కృష్ణా నగర్ ప్రాంతాలకు చెందిన ఆస్తి యజమానులు, కాలనీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.





