అమరావతిలో ఇప్పటివరకూ మొత్తం 114 సంస్థలకు భూములు కేటాయించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. వీటిలో చాలా సంస్థలు తమ నిర్మాణాలను ప్రారంభించాయని చెప్పారు. రాజధానిలో భూముల కేటాయింపునకు సంబంధించిన మంత్రి వర్గ ఉపసంఘం ఆన్ లైన్ లో సమావేశమైంది.ఈ సమావేశానికి మంత్రులు నారాయణ,పయ్యావుల కేశవ్,టీజీ భరత్,కందుల దుర్గేశ్,కొల్లు రవీంద్ర,సంధ్యా రాణి తో పాటు సీఆర్డీఏ కమిషనర్ విజయరామరాజు హాజరయ్యారు.
అనంతkం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ అమరావతిలో ఇప్పటివరకూ 114 సంస్థలకు 1269 ఎకరాలు కేటాయించాం.వీటిలో 70 ప్రభుత్వ సంస్థలు,44 ప్రైవేటు సంస్థలు ఉన్నాయి.భూములు కేటాయించిన వాటిలో బ్యాంకులు 16,ఉద్యోగుల ఇళ్ల కోసం 8 బ్యాంకులకు,విద్యాసంస్థలు 22,రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు 13,కేంద్రప్రభుత్వ సంస్థలు 17,వైద్య సంస్థలు 7,హోటల్స్ 14, క్రీడా సంస్ధలు 2, ఇతర సంస్థలు 5 ఉన్నాయన్నారు.
20 సంస్థల నిర్మాణం కొనసాగుతుండగా,9 సంస్థలు నిర్మాణం పూర్తయ్యాయి.18 సంస్థలు నగదు చెల్లించే దశలో,25 సంస్థలు అగ్రిమెంట్ దశలో,మరో 38 సంస్థలు డిజైన్ల దశలో ఉన్నట్లు మంత్రి నారాయణ చెప్పారు. భూములు కేటాయించిన 114 సంస్థల్లో 3 సంస్థలు వేర్వేరు కారణాలతో రద్దు చేసుకున్నాయి.వీటిలో జీఆర్టీ హోటల్స్,స్ప్లెండర్,IRCTC(ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) సంస్థలున్నాయి.ఐఆర్సీసీటీసీ కొత్తగా ఎక్కడా నిర్మాణాలు చేపట్టకూడదని తీసుకున్న పాలసీ నిర్ణయంలో భాగంగా కేటాయింపును రద్దు చేసుకున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు.
భూముల కేటాయింపు కోసం 16 సంస్థలు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నట్లు మంత్రి నారాయణ చెప్పారు..ఆయా సంస్ధలకు కేటాయింపులపై ఆసక్తి వ్యక్తీకరణ లేదా రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ద్వారా ముందుకు వెళ్తామన్నారు. APHRDI,ఏపీ పబ్లిక్ లైబ్రరీస్,తెలుగు కల్చరల్ సెంటర్,సబ్సిడరీ ఇంటిలిజెన్స్ బ్యూరో(SIB) సంస్థలకు గతంలో కేటాయించిన విస్తీర్ణంలో మార్పులు చేయడంతో పాటు స్థలం కూడా మార్పు చేసినట్లు మంత్రి చెప్పారు.
ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులతో రాజధాని నిర్మాణానికి ఎలాంటి ఇబ్బంది లేదని మంత్రి నారాయణ స్పష్టం చేసారు. రాజధాని పనుల్లో ఉపయోగిస్తున్న మెషినరీకి డీజిల్ కొరత లేకుండా ఆయా కాంట్రాక్ట్ సంస్ధలు చర్యలు తీసుకున్నాయన్నారు.
అమరావతిలో తమకు భూకేటాయింపులు చేయాలని ముంబై నుంచి బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ లాంటి వారు కోరారని మంత్రి చెప్పారు..అయితే ఎవరికి భూములు కేటాయించాలన్నా ముందుగా డీపీఆర్ తో పాటు వారి ఆర్ధిక పరిస్థితి అనగా బ్యాలెన్స్ షీట్,ఫైనాన్సియల్ షీట్ చూసిన తర్వాత నిర్ణయం తీసుకుంటున్నామన్నారు..ఒకసారి భూకేటాయింపులు చేసిన తర్వాత ఆర్ధిక ఇబ్బందులతో నిలిపివేస్తే ఇబ్బందులు వస్తాయని మంత్రి చెప్పారు.





