ఏపీ పారిశ్రామికాభివృద్ధి విధానం చాలా బాగుంది : ఢిల్లీ మంత్రి స‌ర్దార్ మంజింద‌ర్ సింగ్ శిర్సా

Must read

అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణ తీరును చూశాం. నిజంగా ఇదొక అద్భుతం. ప్ర‌పంచంలోనే ఇదొక‌ గొప్ప న‌గ‌రంగా మారుతుంది. నారా చంద్ర‌బాబు నాయుడు విజ‌న‌రీ ముఖ్య‌మంత్రి. అభివృద్ధికి, దార్శ‌నిక‌త‌కు ఆయ‌నొక విశ్వ‌విద్యాల‌యం. ప‌బ్లిక్ ప్రైవేటు భాగ‌స్వామ్యంలో ఏపీ ప్ర‌భుత్వం మార్గ‌ద‌ర్శి. ఏపీని చూసి ఢిల్లీ ప్ర‌భుత్వం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. పెట్టుబ‌డుల ఆక‌ర్ష‌ణ‌, స్మార్ట్ గ‌వ‌ర్నెన్స్ త‌దిత‌ర అనేక రంగాల్లో మాకు మీ స‌హ‌కారం కావాలి అని మంత్రులు లోకేష్‌, టీజీ భ‌ర‌త్‌ల‌తో ఢిల్లీ ప‌రిశ్ర‌మ‌లు, ఆహారం, అట‌వీ ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి స‌ర్దార్ మన్‌జింద‌ర్ సింగ్ శిర్సా కోరారు. ఢిల్లీ ప్ర‌భుత్వ ప‌రిశ్ర‌మ‌లు, అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి స‌ర్దార్ మ‌న్‌జింద‌ర్ సింగ్ శిర్సా నేతృత్వంలో ఆ ప్ర‌భుత్వానికి చెందిన ప్ర‌త్యేక ప్ర‌తినిధుల బృందం ఏపీలో ప‌ర్య‌టించి ఇక్క‌డి పారిశ్రామిక విధానాలు, పాల‌నా సంస్క‌ర‌ణ‌ల‌ను అధ్యయనం చేస్తోంది. సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీెఎస్)లో రాష్ట్ర పరిశ్రమల శాఖ అధికారులతో ఈ బృందం మంగ‌ళ‌వారం స‌మావేశ‌మైంది.

ఈ బృందానికి రాష్ట్ర ఐటీ, ఆర్టీజీ శాఖ మంత్రి నారా లోకేష్, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్‌లు సాద‌ర స్వాగ‌తం ప‌లికి రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న పారిశ్రామిక విధానం గురించి వివ‌రించారు. దేశంలోనే ఆంధ్ర‌ప్ర‌దేశ్ పెట్టుబ‌డుల‌కు స్వ‌ర్గ‌ధామంగా మారింద‌ని మంత్రి నారా లోకేష్ వివ‌రించారు. 2026 ఆర్థిక సంవ‌త్సంలో ఆంధ్రప్ర‌దేశ్ 18 బిలియ‌న్ డాల‌ర్ల‌ పెట్టుబ‌డులను సాధించింద‌న్నారు. భాత‌ర‌దేశం ఆక‌ర్షిస్తున్న‌పెట్టుబ‌డుల్లో 25 శాతం పెట్టుబ‌డులు ఒక్క ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికే వ‌స్తున్నాయ‌ని వివ‌రించారు. ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఆశ‌యాల‌క‌నుగుణంగా క్ల‌స్ట‌ర్ ఆధారిత అభివృద్ధి దిశ‌గా పారిశ్రామికాభివృద్ధి సాధిస్తున్నామ‌న్నారు. తిరుప‌తి ప్రాంతంలో ఎల‌క్ట్రానిక్ క్ల‌స్ట‌ర్ ఏర్పాటు చేయ‌డం ద్వారా ఆ రంగానికి చెందిన ప‌రిశ్ర‌మ‌లు, అనుబంధ‌ రంగ ప‌రిశ్ర‌మ‌ల‌న్నీ ఒకే చోట నెల‌కొల్ప‌డానికి కావాల్సిన అనువైన వాతావ‌ర‌ణం ఏర్పాటు చేశామ‌న్నారు. రాష్ట్రంలో మొత్తం 22 క్ల‌స్ట‌ర్ల‌ను ఏర్పాటు చేస్తున్నామ‌న్నారు.

అమ‌రావ‌తి, తిరుప‌తి, విశాఖ‌ప‌ట్నం ప్రాంతాల‌ను ఎక‌నామిక్ జోన్‌లుగా అభివృద్ధి చేస్తున్నామ‌న్నారు. ఇటీవ‌లే ఉత్త‌రాంధ్ర ప్ర‌గ‌తికి కీల‌కం కానున్న భోగాపురం అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యాన్ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోదీ చేతుల మీదుగా ప్రారంభించామ‌న్నారు. రాయ‌ల‌సీమ‌లోని క‌ర్నూలు జిల్లాలో 300 ఎక‌రాల్లో డ్రోన్ సిటీ ఏర్పాటు చేస్తున్నామ‌ని తెలిపారు. డేటా లేక్ ద్వారా పాల‌న‌ను మ‌రింత స‌ర‌ళీకృతం చేస్తున్నామ‌ని తెలిపారు. ప్ర‌భుత్వంలోని అన్ని శాఖ‌లకు చెందిన డేటాను ఒక చోట అనుసంధానించి డేటా లేక్ రూపొందించామ‌ని, దాని ద్వారా స్మార్ట్ గ‌వ‌ర్నెన్స్ ప్ర‌జ‌ల‌కు చేరువ చేస్తున్నామ‌న్నారు. డేటా కేవ‌లం ఒక సోర్సు నుంచి కాకుండా ప‌లు సోర్సుల ద్వారా సేక‌రించి ఎప్ప‌టిక‌ప్పుడు విశ్లేషించి డేటాను నిరంత‌రం అప్‌డేట్ చేస్తూ పార‌ద‌ర్శ‌క పాల‌న అందిస్తున్నామ‌న్నారు. ప్ర‌భుత్వ ప‌నితీరును కూడా తాము ఎప్ప‌టిక‌ప్పుడు విశ్లేషించుకుంటున్నామ‌ని, ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌లు కార్యక్ర‌మాల‌పై ప్ర‌జ‌ల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని పాజిటివ్ ప‌బ్లిక్ ప‌ర్సెప్ష‌న్ ప‌రిశీలిస్తూ ప‌నిచేస్తున్నామ‌న్నారు. మంత్రుల మొద‌లు, ప్ర‌భుత్వంలో కింది స్థాయి ఉద్యోగి వ‌ర‌కు వారి ప‌నితీరుకు ర్యాంకులు ఇస్తున్నామ‌న్నారు. ఆయా ప్రాంతాల్లో స‌భ‌లు నిర్వ‌హించిన‌ప్పుడు అక్క‌డ ఆ స‌భ‌ల్లోనే ప్ర‌జ‌ల స‌మ‌క్షంలో మంచిగా ప‌నిచేసిన ఉద్యోగుల‌ను అభినందిస్తున్నామ‌ని తెలిపారు.

ఈ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌లో ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నార‌ని, వారి ఆశ‌లు, ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా త‌మ ప్ర‌భుత్వం నిరంత‌రం పాటుప‌డుతోంద‌న్నారు. ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ మాట్లాడుతూ పెట్టుబ‌డులు పెట్ట‌డానికి ఏపీ అన్నివిధాలా అనుకూల‌మైన రాష్ట్రంగా నిలుస్తోంద‌న్నారు. రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్ట‌డానికి ముందుకు వ‌చ్చే వారికి ఎలాంటి అవ‌రోధాలు లేకుండా అనుమతుల‌న్నీ సుల‌భంగా వ‌చ్చేలా సింగిల్ డెస్క్ పోర్ట‌ల్ అమ‌లు చేస్తున్నామ‌న్నారు. డేటా సెంట‌ర్లు, షిప్ బిల్డింగ్‌, సెమీకండ‌క్టర్స్‌, మెడిక‌ల్ డివైజులు, ఫార్మా, ఏరోస్పేస్‌, డిఫెన్స్‌, డ్రోన్స్‌ల మొద‌లు రాష్ట్రంలో 22 ప్ర‌త్యేక క్ల‌స్ట‌ర్లు అభివృద్ధి చేస్తున్నామ‌న్నారు. గ‌త రెండేళ్లుగా నూత‌న పారిశ్రామికాభివృద్ధి విధానం 4.0 ద్వారా స‌త్ఫ‌లితాలు సాధిస్తున్నామ‌న్నారు.

ఏపీ నుంచి మేం ఎంతో నేర్చుకోవాలి.. ఏపీ స‌హ‌కారం కావాలి
పెట్టుబ‌డుల ఆక‌ర్ష‌ణ‌, పారిశ్రామికాభివృద్ధి విధానాల అమ‌లు త‌దిత‌ర అనేక అంశాల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను చూసి మేము చాలా నేర్చుకోవాల్సి ఉంద‌ని ఢిల్లీ ప్ర‌భుత్వ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి స‌ర్దార్ మన్‌జింద‌ర్ సింగ్ శిర్సా అన్నారు. తాను చాలా ప్ర‌భుత్వాల‌ను చూస్తున్నాన‌ని కానీ డేటాను ఇంత స‌మ‌ర్థ‌వంతంగా వినియోగించుకుని స‌త్ఫ‌లితాలు సాధిస్తున్న రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాత్ర‌మే అన్నారు. ప‌బ్లిక్ ప్రైవేటు పార్ట‌న‌ర్షిప్ కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ దేశానికే మార్గ‌ద‌ర్శిగా నిలిచింద‌న్నారు. అమ‌రావ‌తిలో ఇంత పెద్ద నిర్మాణ ప‌నులు జ‌రుగుతుండ‌టం చూసి ఆశ్చ‌ర్య‌పోయాన‌న్నారు. ఢిల్లీలో ఇంత పెద్ద నిర్మాణాలు జ‌ర‌గ‌డానికి ఆస్కారం లేద‌న్నారు. భ‌విష్య‌త్తులో అమ‌రావ‌తి ప్ర‌పంచంలోనే ఒక గొప్ప న‌గ‌రంగా అభివృద్ధి చెందుతుంద‌న‌డంలో ఎంత మాత్రం అనుమానం లేద‌న్నారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఒక విశ్వ‌విద్యాల‌యం లాంటి వార‌ని, ఆయ‌న పుత్రులు మంత్రి నారా లోకేష్ అని కొనియాడారు. మీ విశ్వ విద్యాల‌యంలో ఇప్పుడు మాకు కూడా అడ్మిష‌న్ ఇవ్వండి అని మంత్రి స‌ర్దార్ మ‌న్‌జింద‌ర్ సింగ్ చ‌మ‌త్క‌రించారు. పెట్టుబ‌డుల ఆక‌ర్ష‌ణ‌, పారిశ్రామిక విధానాల రూప‌క‌ల్ప‌న‌, డేటా డ్రివ‌న్ గ‌వ‌ర్నెన్స్ అమ‌లు, స్మార్ట్ గ‌వ‌ర్నెన్స్ త‌దిత‌ర అంశాల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికున్న అపార అనుభ‌వంతో ఢిల్లీ ప్ర‌భుత్వానికి ఏపీ స‌హ‌కారం అందించాల‌ని కోరారు. ఏపీ బృందాన్ని ఢిల్లీకి పంపాల‌ని, అక్క‌డ త‌మ అధికారుల‌కు ఇక్క‌డ చేప‌డుతున్న కార్య‌క్ర‌మాలు, విధానాల గురించి వివ‌రించాల‌ని కోరారు. దీనికి మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ ఢిల్లీ ప్ర‌భుత్వానికి తాము పూర్తి స‌హ‌కారం అందించ‌డానికి సిద్ధంగా ఉన్నామ‌న్నారు. అనంత‌రం ప్ర‌తినిధుల బృందాన్ని మంత్రి నారా లోకేష్ స‌త్క‌రించి జ్ఞాపిక‌లు అంద‌జేశారు. ఈ స‌మావేశంలో ఢిల్లీ ప్ర‌భుత్వ అద‌న‌పు ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌న్ సింగ్ యాద‌వ్‌, రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌ల శాఖ కార్య‌ద‌ర్శి యువ‌రాజ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!