కన్నార్పకుండా అబద్దాలు ఆడడం… కుల చిచ్చు రాజేసి రాజకీయాలు చేయడం గొడ్డలి పార్టీకి అలవాటుగా మారిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. బుధవారం జొన్నగిరిలో జరిగిన బహిరంగ సభలో రాష్ట్రంలో జరుగుతున్న వివిధ రాజకీయ పరిణామాలపైనా, ప్రభుత్వం మీద జరుగుతున్న కుట్రలు, దుష్ప్రచారంపై సీఎం స్పందించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…“ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై గొడ్డలి పార్టీ లేనిపోని దుష్ప్రచారం చేస్తోంది. గొడ్డలి పార్టీ నేతలు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసుకుని పని గట్టుకుని కుట్రలు పన్నుతున్నారు. విజయవాడ సాయికృష్ణ అదృశ్యం ఘటనలో కులాలను ఆపాదిస్తూ విషం చిమ్ముతున్నారు. కన్నార్పకుండా అబద్దాలు చెప్పటంలో గొడ్డలి పార్టీ నాయకుడు దిట్ట. అన్ని ఘటనలకూ కులం రంగు పూసి రెచ్చగొడుతున్నారు.
తప్పులు చేయడం ప్రజలను మభ్యపెట్టడం గొడ్డలి పార్టీ నాయకుడికి అలవాటు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసేలా కల్తీ నెయ్యిని గత ప్రభుత్వంలోని పాలకమండలి వాడింది. లడ్డూ ప్రసాదం విషయంలో గొడ్డలి పార్టీ పాలనలో చేసిన ఘాతుకాలు బయట పడ్డాయి. ఇప్పుడు ప్రజలను మభ్యపెట్టేందుకు గొడ్డలి పార్టీ నాయకుడు దేవాలయాల చుట్టూ తిరుగుతున్నాడు. గొడ్జలి పార్టీ నాయకుడి కుట్రలన్నీ బయటపడ్డాయి… ఇప్పుడు ఎన్ని దండాలు పెట్టినా లాభం లేదు. గొడ్డలి పార్టీ నాయకుడు ఆచరించే మతాన్ని అంతా గౌరవిస్తున్నాం… కానీ వాళ్లు దేవాలయాల పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. చూస్తూ ఊరుకోం.”అని సీఎం చంద్రబాబు అన్నారు.
“గత పాలకులు ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదు. కానీ డీఎస్సీ నియామకాలపై బురద చల్లుతున్నారు. పేపర్ లీక్ అయ్యిందని ఒకసారి, పోస్టులు ఇవ్వలేదని మరోసారి ఇలా లేని పోని దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు. డీఎస్సీ నిర్వహణ, టీచర్ పోస్టుల భర్తీపై సవాలు విసిరితే గొడ్డలి పార్టీ తోక ముడిచింది. వారంలో సీపీఎస్ రద్దు చేస్తామని గత పాలకులు అన్నారు. అధికారంలోకి వచ్చాక ఎన్ని వారాలు గడిచినా పట్టించుకోలేదు. హామీ ఇవ్వకున్నా 10,800 మంది ఉద్యోగులను సీపీఎస్ నుంచి పాత పెన్షన్ స్కీమ్ కు తీసుకువచ్చాం.
ఈ నిర్ణయం వల్ల ఒక్కొక్కరికీ గరిష్టంగా రూ.3 కోట్ల వరకూ ప్రయోజనం కలుగుతుంది. ఉద్యోగులకు మేలు చేయాలనే ఉధ్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. రాజకీయ ముసుగు వేసుకున్న గొడ్డలి పార్టీ గంజాయి, బ్లేడ్ బ్యాచ్ లకు అండగా నిలుస్తోంది. యువకులను చెడు మార్గం పట్టించి… రాజకీయ అవసరాలకు వాడుకుని బలి చేస్తోంది. ఇది ఫ్యాక్షన్ నేతల మైండ్ సెట్. గొడ్డలి పార్టీకి విధ్వంసమే విజన్… ఫేక్ ప్రచారమే విధానం…రప్పా రప్పా రాజకీయాలే మేనిఫెస్టో. బాబాయి మర్డర్ నుంచి మొన్నటి పాస్టర్ రోడ్డు ప్రమాదం వరకు వాళ్లు కుట్రలనే నమ్ముకున్నారు. పోస్టర్లకు జంతు బలులు ఇవ్వటం గొడ్డలి పార్టీ నైజం. వారి రప్పా రప్పా రాజకీయాలు చూసేందుకు మేం సిద్ధంగా లేం. గొడ్డలి పార్టీకి భవిష్యత్తు లేదు.”అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
“సీమ ప్రజలకు ఏం చేసిందో గొడ్డలి పార్టీ సమాధానం చెప్పగలదా…? ప్రాజెక్టులు తెచ్చి, ఫ్యాక్షన్ అంతం చేసింది ప్రజా ప్రభుత్వమే. ఎన్జీటీలో స్టే వెకేట్ చేయించలేని వ్యక్తులు రాయలసీమ లిఫ్ట్ గురించి మాట్లాడుతున్నారు. నీళ్లు ఇస్తామని సెట్టింగులతో గేట్లు పెట్టి తీసేశారు. సీమకు నీళ్లిచ్చే విషయంలో వారికి చిత్తశుద్ది లేదు. కనీసం ప్రాజెక్టు గేట్లు కూడా మరమ్మత్తులు చేయించలేక పోయారు.
కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతల వారీగా ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతోంది. ఇరిగేషన్ క్యాలెండర్ ఇచ్చింది. కర్ణాటకతో కలిసి తుంగభద్రకు కొత్త గేట్లు ఏర్పాటు చేశాం. 2019 తర్వాత విధ్వంస పాలన వల్ల ఏపీకి కోలుకోలేని నష్టం జరిగింది. రాష్ట్రానికి పరిశ్రమలు, ఆదాయం తేవాలని మేం ఆలోచిస్తుంటే… గొడ్డలి పార్టీ మాత్రం రాత్రిపగలు కుట్రలు చేస్తోంది. కులం ప్రాంతం, మతం, వర్గాల వారీగా విడదీసేలా విషం చిమ్ముతోంది. గొడ్డలి పార్టీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడతాం. వాస్తవాలను వెల్లడిస్తూ ఇప్పుడు ప్రోగ్రెస్ రిపోర్టులు జారీ చేస్తాం.”అని సీఎం చంద్రబాబు చెప్పారు.





