రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పరిధిలోని రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడి సాయంగా అందిస్తున్న ‘అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్’ పథకం కింద 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడత నిధులను విడుదల చేశారు.
కాకినాడ జిల్లావ్యాప్తంగా 2.73 లక్షల రైతు కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతుండగా, రూ. 99.58 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. శనివారం మన ఊరు మాటా మంతి కార్యక్రమంలో ప్రాధాన్యతాంశంగా ‘అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్’ను తీసుకున్నారు.
రైతులతో కలసి ఈ మొత్తం నిధులు విడుదల చేశారు. తొలి విడత ఆర్థిక సాయం కింద రాష్ట్రవ్యాప్తంగా సుమారు 47 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 7,000 చొప్పున జమ కానున్నాయి. అందులో కేంద్ర ప్రభుత్వం రూ. 2 వేలు, రాష్ట్ర ప్రభుత్వం 5 వేలు అందజేస్తుంది. అన్నదాత కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏటా మూడు విడతల్లో రూ. 6 వేలు అందజేస్తుండగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మరో రూ. 14,000 కలిపి ఏడాదికి రూ. 20 వేల చొప్పున పెట్టుబడి సాయం కింద అందజేస్తోందన్నారు..
ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ వరుసగా రెండో ఏడాది అన్నదాతకు అండగా నిలవడం రైతు సంక్షేమం పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న సంకల్పానికి నిదర్శనమని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రైతులతో కలసి నిధులు విడుదల చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ , రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీలు శ్రీ లింగమనేని రమేష్ , వల్లభనేని బాలశౌరి , ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు , జిల్లా అధికారులు పాల్గొన్నారు.





