తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ముంబై పర్యటనకు వెళ్లనున్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మనువరాలు, ఎంపీ సుప్రియా సూలే కుమార్తె వివాహ వేడుకకు సీఎం హాజరుకానున్నారు. ఈ పర్యటనలో భాగంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో తెలంగాణకు కీలకమైన తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు అనుమతుల అంశంపై చర్చించే అవకాశం ఉంది. మహారాష్ట్ర పర్యటన అనంతరం రేపు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపనున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన నిధుల విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచే దిశగా సీఎం చర్యలు చేపట్టనున్నారు. సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, ఆ శాఖ ఉన్నతాధికారులతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు, నిధుల విడుదలపై చర్చలు జరగనున్నట్లు సమాచారం.
ముంబైకి సీఎం రేవంత్ రెడ్డి.. ఫడ్నవీస్తో కీలక భేటీకి అవకాశం





