శ్రీరాముడి ఆశీస్సులతో ధర్మబద్ధమైన పాలన అందిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాముడి పేరు వినగానే సుపరిపాలన, రామరాజ్యం గుర్తుకు వస్తాయని, అదే స్ఫూర్తితో తమ కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు.కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంలో సీఎం తన అర్ధాంగి భువనేశ్వరితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.
ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులకు టీటీడీ అధికారులు, పండితులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ కల్యాణ వేడుకను వేలాది మంది భక్తులు భక్తి భావంతో వీక్షించారు. అనంతరం అర్చకులు ముఖ్యమంత్రిని ఆశీర్వదించి స్వామివారి ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.ఈ సందర్భంగా “జై శ్రీరామ్” నినాదంతో తన ప్రసంగాన్ని ప్రారంభించిన సీఎం, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, ఆరోగ్యంతో ఉండాలని శ్రీరాముడును ప్రార్థించినట్లు తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం ఒంటిమిట్ట ఆలయాన్ని టీటీడీలో విలీనం చేసి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
అదేవిధంగా, ఇదే రోజు లోక్సభలో అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. పూర్వం దేవేంద్రుడు పాలించిన రాజధాని అమరావతి కాగా, నేడు ప్రజల రాజధానిగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు.శ్రీరాముని మార్గంలో నడుస్తూ ప్రజలకు ధర్మబద్ధమైన పాలన అందిస్తామని, రామరాజ్యంలాంటి సుపరిపాలనను రాష్ట్రంలో నెలకొల్పడమే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని హామీ ఇచ్చారు.





