తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం అధినేత C. జోషేఫ్ విజయ్ తన తొలి క్యాబినెట్ సమావేశంలోనే కీలక నిర్ణయాలు తీసుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధిక ఆదాయాన్ని అందించే ప్రభుత్వ మద్యం విక్రయాల సంస్థ టాస్మాక్ లో జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్న అక్రమాలు, నిధుల మళ్లింపులు, అనధికారిక వసూళ్లపై కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. మద్యం విక్రయాల ద్వారా వచ్చే ప్రతి రూపాయి నేరుగా ప్రభుత్వ ఖజానాకు చేరేలా పారదర్శక వ్యవస్థను అమలు చేయాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.
శుక్రవారం జరిగిన తొలి క్యాబినెట్ సమావేశంలో టాస్మాక్ కార్యకలాపాలపై ఉన్నతాధికారులు సమగ్ర నివేదికను ముఖ్యమంత్రి విజయ్కు సమర్పించారు. ఆ నివేదికలో వెల్లడైన అంశాలు ప్రభుత్వ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసినట్లు తెలుస్తోంది. టాస్మాక్ హోల్సేల్, రవాణా, రిటైల్ విక్రయాల వ్యవస్థలో నెలకు సుమారు రూ.102 కోట్ల మేర అనధికారిక వసూళ్లు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ లెక్కన గత ఐదేళ్లలో దాదాపు రూ.1,600 కోట్ల వరకు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ఇతర మార్గాల్లో మళ్లిపోయి ఉండొచ్చని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
నివేదికల ప్రకారం, మద్యం తయారీ సంస్థల నుంచి రిటైల్ దుకాణాల వరకు సరఫరా గొలుసులో ప్రతి దశలో అదనపు వసూళ్లు జరుగుతున్నట్లు గుర్తించారు. ప్రతి లిక్కర్ కేసుపై రూ.90, బీర్ కేసుపై రూ.40, వైన్ కేసుపై రూ.20 చొప్పున అనధికారికంగా వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఈ విధంగా ఏర్పడిన నెట్వర్క్ ద్వారా భారీ మొత్తాలు అధికారిక లెక్కల్లోకి రాకుండా పోతున్నాయని అధికారులు సీఎంకు వివరించినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి విజయ్ కఠిన వైఖరి అవలంబించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మద్యం విక్రయాల ద్వారా వచ్చే ఆదాయం ప్రజా సంక్షేమ పథకాలకు, మౌలిక వసతుల అభివృద్ధికి వినియోగించాల్సిన నిధి అని, అందులో ఎలాంటి లీకేజీలకు అవకాశం ఉండకూడదని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. టాస్మాక్ వ్యవస్థను పూర్తిగా డిజిటలైజ్ చేయడం, ప్రతి లావాదేవీని పర్యవేక్షించే సాంకేతిక వ్యవస్థలను బలోపేతం చేయడం వంటి అంశాలపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
గత కొంతకాలంగా వివాదాస్పదంగా మారిన ‘రూ.10 ఖాళీ సీసాల డిపాజిట్ స్కీమ్’పై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మద్యం కొనుగోలు సమయంలో వినియోగదారుల నుంచి అదనంగా తీసుకుంటున్న ఈ డిపాజిట్ మొత్తాల లావాదేవీల్లో కూడా పారదర్శకత లోపించిందని నివేదికలు సూచించినట్లు సమాచారం. ఖాళీ సీసాలు తిరిగి ఇచ్చిన వినియోగదారులకు డబ్బులు పూర్తిగా చేరడం లేదనే ఫిర్యాదులు కూడా ప్రభుత్వ దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ సమస్యకు పరిష్కారంగా డిపాజిట్ మొత్తాన్ని నేరుగా ఎంఆర్పీలో కలపడం లేదా డిజిటల్ రీఫండ్ వ్యవస్థను అమలు చేయడం వంటి ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. జూన్ చివరి నాటికి ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకుని కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని అధికారులు ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం.
తమిళనాడు ఆర్థిక వ్యవస్థలో టాస్మాక్ కీలక పాత్ర పోషిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి ఏడాది వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని అందించే ఈ సంస్థలో పారదర్శకత, సమర్థత పెంచడం ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని మరింతగా పెంచే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో అక్రమ వసూళ్లను అరికట్టడం ద్వారా ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం కూడా పెరుగుతుందని వారు చెబుతున్నారు.





