దేశ రాజధాని న్యూఢిల్లీలో మానవ సంబంధాల విలువలను ప్రశ్నించేలా అత్యంత క్రూరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. భార్యకు ఉన్న వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించినందుకు ఓ యువకుడిని అతని భార్య, అత్త కలిసి పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఢిల్లీలోని జహంగీర్పురి ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ దారుణం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత యువకుడు తన భార్య ప్రవర్తనపై గత కొంతకాలంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఘటన జరిగిన రోజు కూడా ఈ అంశంపైనే తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఈ దారుణ ఘటన జహంగీర్పురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ అద్దె ఇంట్లో జరిగింది. ఇంటి యజమాని తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి సుమారు 8:30 గంటల సమయంలో ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మొదట్లో స్థానికులు దీనిని షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన ప్రమాదంగా భావించారు.
అయితే కొన్ని క్షణాల్లోనే ఊహించని దృశ్యం బయటపడింది. ఒంటిపై బట్టలు లేకుండా, శరీరం మొత్తం మంటల్లో కాలిపోతూ ఓ యువకుడు ప్రాణభయంతో కేకలు వేస్తూ మెట్లపై నుంచి కిందకు పడిపోయాడు. అతని అరుపులు విన్న స్థానికులు వెంటనే అక్కడికి పరుగెత్తి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. తీవ్రంగా కాలిన గాయాలతో యువకుడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించినప్పటికీ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితుడు ఇచ్చిన వాంగ్మూలం కేసులో కీలకంగా మారింది. తన భార్యకు ఉన్న వివాహేతర సంబంధం గురించి ప్రశ్నించగా, ఆమె తన తల్లితో కలిసి తనపై పెట్రోల్ పోసి నిప్పంటించిందని బాధితుడు చెప్పినట్లు తెలుస్తోంది.
ఈ స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం నిందితులైన భార్య, ఆమె తల్లిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పోలీసులు ఇంటి పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలు, పొరుగువారి వాంగ్మూలాలు, కాల్ రికార్డులను కూడా పరిశీలిస్తున్నారు. ఘటనకు ముందు ఇంట్లో ఏం జరిగింది? దాడి ముందే ప్లాన్ చేశారా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇంటి బయటకు మంటల్లో పరుగెత్తుకుంటూ వచ్చిన యువకుడిని చూసి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. “అలాంటి దృశ్యం జీవితంలో ఎప్పుడూ చూడలేదు” అంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఒక కుటుంబ వివాదం ఇంత దారుణానికి దారితీయడం బాధాకరమని, మానవత్వం పూర్తిగా మరిచిపోయిన ఘటనగా పలువురు అభివర్ణిస్తున్నారు.
ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిందితులకు కఠిన శిక్షలు విధించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. మహిళలపై జరిగే నేరాల మాదిరిగానే పురుషులపై జరిగే కు టుంబ హింస కేసులను కూడా సమాజం సీరియస్గా తీసుకోవాలని కొందరు అభిప్రాయపడుతున్నారు.ప్రస్తుతం పోలీసులు నిందితులను విచారిస్తూ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ ఆధారాలు కూడా కేసులో కీలకంగా మారనున్నాయి.





