తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ విద్యా సంస్థలు కొనసాగిస్తున్న అడ్డగోలు ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) ఆధ్వర్యంలో నేడు ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన “మహాధర్నా” భారీ విజయవంతమైంది. మండుటెండను సైతం లెక్కచేయకుండా రాష్ట్ర నలుమూలల నుండి వేలాదిమంది తల్లిదండ్రులు, విద్యార్థులు, యువత మరియు కార్యకర్తలు హాజరై ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ధర్నా ప్రాంగణం నినాదాలతో మార్మోగి, ప్రైవేట్ విద్యా దోపిడీపై ప్రజల ఆవేదన స్పష్టంగా కనిపించింది. ఈ సందర్భంగా మాట్లాడిన పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా వ్యాపార ధోరణిలో నడుస్తోందని తీవ్రంగా విమర్శించారు. “పిల్లల భవిష్యత్తును బంధకం పెట్టి తల్లిదండ్రుల కష్టార్జితాన్ని దోచుకుంటున్నారు. ఫీజులు కాదు భయం అమ్ముతున్నారు. చదువు పేరుతో పేదవాడి కలలను నెమ్మదిగా చంపేస్తున్నారు అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
ప్రైవేట్ విద్యాసంస్థలు అడ్మిషన్ల పేరుతో, స్పెషల్ ఫీజులు, డొనేషన్లు, బస్ ఫీజులు, మెటీరియల్ ఛార్జీలు వంటి పేర్లతో లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాయని, ఒక మధ్యతరగతి కుటుంబం ఆదాయం కంటే పిల్లల చదువు ఖర్చు ఎక్కువయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒక రైతు ఏడాది సంపాదన మొత్తం పిల్లాడి ఒక్క సంవత్సరపు ఫీజుకే సరిపోతే, ఇది విద్యా వ్యవస్థ కాదు ఇది బహిరంగ దోపిడీ అన్నారు.
ప్రధాన మీడియా సంస్థలు ఈ నిరసన కార్యక్రమం కీ రాకపోవడానికి,సమస్యలను ప్రజల ముందుకు తీసుకురావడంలో విఫలమవుతున్నాయని మల్లన్న ఆరోపించారు. కార్పొరేట్ విద్యాసంస్థలు యాడ్స్ రూపంలో భారీగా ఖర్చు చేసి మీడియాపై ప్రభావం చూపుతున్నాయని, అందుకే ప్రజా సమస్యలు బయటపడకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు.
ఇతర రాష్ట్రాల్లో ఫీజుల నియంత్రణ వ్యవస్థలు కఠినంగా అమల్లో ఉండగా, తెలంగాణలో మాత్రం లక్షల రూపాయల వసూళ్లు నిర్బంధం లేకుండా కొనసాగుతున్నాయన్నారు.అదనపు భారం పేద, మద్యతరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతూ, విద్యను అందరికీ అందని దూరంగా మార్చుతోందన్నారు.
పేద పిల్లలకు విద్య హక్కును కల్పించే చట్టాల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మల్లన్న మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలలు 1200 బలహీనపడుతుండగా 2500 ప్రైవేట్ విద్యాసంస్థలకు అనుమతులు పెరుగుతున్నాయని, ఇది సామాజిక అసమానతలను మరింత పెంచే పరిస్థితి అని పేర్కొన్నారు. ప్రభుత్వం పాఠశాలలను బలోపేతం చేయాల్సింది పోయి, కార్పొరేట్ విద్యకు మార్గం సుగమం చేస్తోంది అని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో TRP రాష్ట్ర, జిల్లా కమిటీ నాయకులు, MBT నాయకులు,విద్యార్థి సంఘాల ప్రతినిధులు, తల్లిదండ్రులు, ప్రజాసంఘాల నాయకులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.





