పవన్ కల్యాణ్ సభ వివాదం.. పవన్​ కళ్యాణ్​పై మంత్రి పొన్నం ఫైర్

Must read

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్​ కళ్యాణ్​ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, ఆ తర్వాతే రాష్ట్రంలో రాజకీయ సభలు నిర్వహించాలని తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ డిమాండ్ చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున హైదరాబాద్‌లో సభ నిర్వహించాలన్న జనసేన నిర్ణయంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

మంగళవారం మీడియాతో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్, పవన్ కల్యాణ్ తెలంగాణలో పర్యటించడాన్ని లేదా రాజకీయ కార్యక్రమాలు నిర్వహించడాన్ని ఎవరూ అడ్డుకోవడం లేదని స్పష్టం చేశారు. అయితే తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ నాయకుడిపై ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వంటి చారిత్రాత్మక సందర్భంలో రాజకీయ సభ నిర్వహించేందుకు ప్రయత్నించడం సముచితం కాదని అభిప్రాయపడ్డారు.

తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమం, వేలాది మంది ప్రజల పోరాటాలు, అమరవీరుల త్యాగాలను గుర్తు చేస్తూ మంత్రి మాట్లాడారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని, అలాంటి రోజున రాజకీయ కార్యక్రమాలు నిర్వహించడం అనవసర వివాదాలకు దారితీస్తుందని అన్నారు.

ఇటీవల హైదరాబాద్‌లోని సంధ్య కన్వెషన్​ సెంటర్లో “నవ నిర్మాణ సంకల్ప సభ” పేరుతో సమావేశం నిర్వహించాలని జనసేన పార్టీ నిర్ణయించింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించాలనుకున్న ఈ సభకు సుమారు రెండు వేల మంది హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందుకు అనుమతి కోరగా, శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు అనుమతి నిరాకరించారు.

సభకు అనుమతి రాకపోవడంతో పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ రాజకీయాలు, ప్రాంతీయవాదం, జనసేన పార్టీపై వస్తున్న విమర్శలపై స్పందించారు. తన పార్టీపై జరుగుతున్న విమర్శలను ఖండిస్తూ పలు ప్రశ్నలు లేవనెత్తారు.

ఈ పరిణామాల నేపథ్యంలో స్పందించిన పొన్నం ప్రభాకర్, తెలంగాణ ప్రజల భావోద్వేగాలను గౌరవించడం రాజకీయ నాయకుల బాధ్యత అని పేర్కొన్నారు. తెలంగాణకు సంబంధించిన అంశాలపై గతంలో చేసిన వ్యాఖ్యలు, తీసుకున్న రాజకీయ వైఖరిపై పవన్ కల్యాణ్ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలకు బాధ కలిగించిన వ్యాఖ్యలు ఉంటే వాటిపై క్షమాపణ చెప్పడం ద్వారా రాజకీయ మర్యాదను పాటించాలని సూచించారు.

పవన్ కల్యాణ్‌పై వ్యక్తిగతంగా ఎలాంటి వ్యతిరేకత లేదని, కానీ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఎవరూ వ్యవహరించకూడదని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రాజకీయ విమర్శలు, ప్రత్యర్థి వ్యాఖ్యల కోసం కాదని, తెలంగాణ సాధనలో పాల్గొన్న అమరవీరులను స్మరించుకునే రోజు అని అన్నారు.

ఈ అంశం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున సభ నిర్వహించాలన్న జనసేన నిర్ణయం, దానికి అనుమతి నిరాకరణ, అనంతరం జరిగిన రాజకీయ వ్యాఖ్యలతో అధికార, ప్రతిపక్ష వర్గాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!