ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వాతావరణం రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుతూంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
ఒక కార్యక్రమంలో మాట్లాడిన రామానాయుడు, జగన్ రాజకీయ శైలి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా మారిందని ఆరోపించారు. జగన్ లోవ్యాఖ్యల్లో హింసాత్మక ధోరణి కనిపిస్తోందని, అది రాష్ట్రంలో అస్థిరతకు దారితీసే ప్రమాదం ఉందన్నారు. ముఖ్యంగా ‘‘చంపేస్తాం, నరుకుతాం, అంతు చూస్తాం’’ వంటి పదజాలంతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా జగన్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
రాజకీయాల్లో విభిన్న అభిప్రాయాలు సహజమైనవే అయినప్పటికీ, వాటిని వ్యక్తపరిచే తీరు మర్యాదపూర్వకంగా, ప్రజాస్వామ్య పరిమితుల్లో ఉండాల్సిన అవసరం ఉందని, కానీ ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుల నుంచి వస్తున్న వ్యాఖ్యలు ఆ పరిమితులను దాటుతున్నాయని ఆయన విమర్శించారు.
జగన్ రాజకీయాలు ఉగ్రవాదాన్ని మించిన ఉన్మాదంతో నిండిపోయాయని ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత వివాదానికి దారితీశాయి. ప్రజల్లో భయాన్ని సృష్టించే విధంగా మాట్లాడటం సరైన రాజకీయ సంస్కృతి కాదని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలపై చర్చించాల్సింది పోయి, హింసాత్మక భాష వాడటం అనేది బాధాకరమని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఇప్పటికే రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయ నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని వారు సూచిస్తున్నారు.
మరోవైపు, ఈ ఆరోపణలపై ప్రతిపక్ష పార్టీ స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి. అధికార, ప్రతిపక్షాల మధ్య ఈ మాటల యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చే సూచనలు కనిపిస్తున్నాయి.గతంలో జరిగిన కీలక హత్యా కేసులను ప్రస్తావిస్తూ రామానాయుడు ప్రశ్నలు లేవనెత్తారు.
పరిటాల రవి హత్య నుంచి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వరకు సాక్షులు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం వెనుక ఏముంది అని ప్రశ్నించారు. అలాగే రంగా హత్య కేసులో ప్రధాన నిందితుడి కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.





