పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. గత పదిహేనేళ్లుగా అధికారంలో కొనసాగుతున్న టీఎంసీ పాలనపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అవినీతి, హింసాత్మక రాజకీయాలు, బెదిరింపుల వాతావరణం పెరిగిపోయిందని ఆరోపించారు. ఈ బెంగాల్ లో వచ్చేది మేమేనని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఓ ఎన్నికల సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ, బెంగాల్లో ప్రజాస్వామ్య విలువలు ప్రమాదంలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం అంటే విభిన్న అభిప్రాయాలకు గౌరవం ఇవ్వడం అని, కానీ ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిపక్ష స్వరాలను అణచివేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
బెంగాల్ లో ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులు, దాడులు జరుగుతున్నాయని మోదీ ఆరోపించారు. కొన్ని సందర్భాల్లో హత్యలు కూడా చోటుచేసుకున్నాయని, ఈ పరిస్థితి ప్రజాస్వామ్యానికి తీవ్రమైన ముప్పుగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు.
బెంగాల్ సాధారణ ప్రజలు కూడా భయంతో గడపాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రధాని పేర్కొన్నారు. ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోలేని, కాని ప్రస్తుత పరిస్థితులు ప్రజాస్వామ్యానికి పెద్ద ప్రమాదకరంగా మారాయని ఆయన హెచ్చరించారు.
టీఎంసీ ప్రభుత్వం అభివృద్ధి కంటే రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు.. కేంద్ర పథకాలను సమర్థంగా అమలు చేసి ప్రజలకు నేరుగా లాభాలు అందేలా చర్యలు తీసుకుంటామని మోదీ పేర్కొన్నారు.
బెంగాల్ ప్రజలు ఈ పరిస్థితిని ఇకపై సహించబోరని మోదీ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు వారు మార్పు కోరుకుంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల ద్వారా ప్రజలు తమ తీర్పును వెల్లడిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
అధికార పార్టీ, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ఉధృతమయ్యే అవకాశం కనిపిస్తోంది. టీఎంసీ నాయకులు ఈ ఆరోపణలకు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి మరి. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఇలాంటి విమర్శలు, ఆరోపణలు పెరుగుతున్నాయి.





