పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార వేడుకలో రాజకీయ సందడి మధ్య చోటుచేసుకున్న ఒక భావోద్వేగ క్షణం అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రదర్శించిన వినమ్రత, పెద్దల పట్ల ఆయన చూపిన గౌరవం సభకు హాజరైన వేలాది మంది కార్యకర్తలను కదిలించింది. 98 ఏళ్ల వయసున్న భారతీయ జనతా పార్టీ సీనియర్ కార్యకర్త మఖన్ లాల్ సర్కార్కు మోదీ పాదాభివందనం చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
కోల్కతాలో అత్యంత వైభవంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు, బీజేపీ అగ్రనేతలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం జరుగుతున్న వేళ సభ ప్రాంగణం నినాదాలతో మార్మోగిపోయింది. ఇదే సమయంలో వేదిక సమీపానికి వచ్చిన మఖన్ లాల్ సర్కార్ను గమనించిన ప్రధాని మోదీ వెంటనే ఆయన వద్దకు వెళ్లి ప్రత్యేకంగా పలకరించారు.
అక్కడితో ఆగకుండా.. ఆయన పాదాలకు నమస్కరించడం సభలో ఉన్న వారందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అనంతరం ఆయనను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని కొద్దిసేపు మాట్లాడారు. ఈ దృశ్యాన్ని చూసిన బీజేపీ కార్యకర్తలు హర్షధ్వానాలు చేస్తూ చప్పట్లతో సభను మార్మోగించారు. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు నేతలు కూడా ఈ సంఘటనను ప్రశంసించారు.
మఖన్ లాల్ సర్కార్కు బీజేపీ, జనసంఘ్ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ చేపట్టిన ఉద్యమాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా 1953లో కశ్మీర్లో భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే ఉద్యమంలో భాగంగా శ్యామా ప్రసాద్ ముఖర్జీతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఆ సమయంలో ఉద్యమకారులపై పోలీసులు చర్యలు తీసుకోవడంతో మఖన్ లాల్ సర్కార్ కూడా అరెస్టయ్యారు.
దేశ ఐక్యత, జాతీయత కోసం జరిగిన ఆ ఉద్యమంలో పాల్గొన్న వారిలో ఆయన ఒకరిగా గుర్తింపు పొందారు. అప్పటి నుంచి జనసంఘ్, అనంతరం బీజేపీ బలోపేతం కోసం ఆయన నిరంతరం కృషి చేశారు. పార్టీ కోసం దశాబ్దాల పాటు సేవలందించిన ఆయనను బీజేపీ శ్రేణులు ఎంతో గౌరవంగా చూస్తుంటాయి.
ఇలాంటి సీనియర్ కార్యకర్తను ప్రధాని మోదీ ప్రత్యేకంగా గౌరవించడంతో రాజకీయాల్లో ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ, పార్టీ కోసం పనిచేసిన వృద్ధ నాయకులను మరవకపోవడం మోదీ వ్యక్తిత్వానికి నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు. సామాన్య కార్యకర్త నుంచి సీనియర్ నేత వరకు అందరికీ సమాన గౌరవం ఇవ్వడమే బీజేపీ బలం అని పార్టీ నాయకులు పేర్కొన్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మోదీ వినమ్రతను ప్రశంసిస్తూ నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. “పదవి ఎంత పెద్దదైనా సంస్కారం మరువలేదు”, “ఇదే భారతీయ సంస్కృతి”, “పెద్దల పట్ల గౌరవం చూపిన ప్రధాని” అంటూ పలువురు స్పందిస్తున్నారు.





