ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో మరో ప్రతిష్ఠాత్మక గుర్తింపును సొంతం చేసుకున్నారు. ప్రముఖ ఆర్థిక దినపత్రిక ది ఎకనామిక్ టైమ్స్ ప్రదానం చేసే ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ – 2025’ అవార్డుతో ఆయనను సత్కరించింది. ఈ గౌరవం ద్వారా పరిపాలనలో చేపట్టిన సంస్కరణలు, పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడంలో ఆయన చూపిన నాయకత్వానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.
ముంబైలోని జీయో వరల్డ్ కన్వెషన్ సెంటర్ లో ఘనంగా నిర్వహించిన 26వ ఎకనామిక్ టైమ్స్ అవార్డ్స్ ఫర్ కార్పొరేట్ ఎక్సలెన్స్ కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. ఈ వేడుకలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చేతుల మీదుగా చంద్రబాబు నాయుడు అవార్డును స్వీకరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశవ్యాప్తంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వ్యాపార సంస్థల ప్రతినిధులు, విధాన నిర్ణేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
చంద్రబాబు నాయుడు పాలనలో తీసుకున్న సంస్కరణలు ఈ అవార్డు సాధనకు ప్రధాన కారణంగా నిలిచాయి. ముఖ్యంగా ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’, ‘స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్’ వంటి కీలక విధానాలను అమలు చేయడం ద్వారా ప్రభుత్వ సేవలను వేగవంతం చేయడంలో ఆయన ముందడుగు వేశారు. ఈ విధానాల వల్ల రాష్ట్రంలో పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం ఏర్పడింది.
పెట్టుబడుల ఆకర్షణలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గణనీయ పురోగతి సాధించింది. స్వల్పకాలంలోనే సుమారు రూ.20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి హామీలను రాష్ట్రం పొందడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. ఈ అంశాన్ని ఎకనామిక్ టైమ్స్ జ్యూరీ ప్రత్యేకంగా ప్రస్తావించి ఆయన నాయకత్వాన్ని ప్రశంసించింది. పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా వాటిని త్వరితగతిన అమలు చేసే దిశగా ప్రభుత్వం తీసుకున్న చర్యలు కూడా గుర్తింపు పొందాయి.
పరిపాలనలో పారదర్శకత, టెక్నాలజీ వినియోగం, పరిశ్రమలకు అనుకూల విధానాలు వంటి అంశాల్లో చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన చర్యలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. వ్యాపార అనుకూల విధానాలతో రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడంలో ఆయన చూపిన కృషి ఈ అవార్డు రూపంలో ప్రతిఫలించిందని పలువురు ప్రశంసించారు.
ఈ అవార్డు సాధనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు లభించింది. పెట్టుబడులకు ఉత్తమ గమ్యస్థానంగా రాష్ట్రాన్ని నిలబెట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఇది ఒక మద్దతుగా మారింది. పరిశ్రమల స్థాపన, ఉద్యోగావకాశాల సృష్టి, మౌలిక వసతుల అభివృద్ధి వంటి రంగాల్లో రాష్ట్రం మరింత ముందుకు సాగుతుందని ఆశాభావం వ్యక్తమవుతోంది.





