ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న వివిధ ప్రతిష్టాత్మక అభివృద్ధి పనులను రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ కె. రామచంద్ర మోహన్ ఈరోజు సాయంత్రం క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ధర్మకర్తలమండలి సభ్యులు, అధికారులతో కలిసి ఆయన పనుల ప్రగతిని సమీక్షించారు.
పర్యటనలో భాగంగా దేవదాయ కమిషనర్ మొదట నూతన లడ్డూ పోటు భవనాన్ని సందర్శించారు. అక్కడ జరుగుతున్న బయటి రంగులు, లోపలి వాల్ కలరింగ్ మరియు ఫ్లోరింగ్ పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. లడ్డూ పోటుకు సంబంధించిన సెల్లార్ను పూర్తి స్థాయిలో భక్తుల అవసరాలకు వినియోగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
మహామండపం, అన్నదాన భవన పరిశీలన – ఏకరూపతపై కీలక ఆదేశాలు:
అనంతరం నూతన అన్నదాన భవనానికి వస్తున్న రంగులు, అక్కడ జరుగుతున్న ఫ్లోరింగ్ పనులను కమిషనర్ నిశితంగా పరిశీలించారు. తదుపరి మహా మండపం ఏడవ అంతస్తులోని ప్రాకార ప్రాంతాన్ని సందర్శించి, గతంలో అక్కడ వేసిన రంగుల స్థితిగతులను పరిశీలన చేసి అదే విధంగా కొత్త భవనాల రంగులు ఉండేలా రూపకల్పన చేయాలని
కమిషనర్ శ్రీ రామచంద్ర మోహన్ ఇంజనీరింగ్ అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
”ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులకు కళ్లకు ఆహ్లాదకరంగా, మనస్సుకు ప్రశాంతతను చేకూర్చే ఆధ్యాత్మిక రంగులను ఎంపిక చేయాలి. నూతన లడ్డూ పోటు, అన్నదాన భవనం, మహామండపం.. ఈ మూడు భవనాలు వేర్వేరుగా కాకుండా, ఒకే తరహా రంగులతో ఏకరూపత (Uniformity) కలిగి ఉండాలి. ఆలయ ప్రాంగణమంతా ఒకే ఆధ్యాత్మిక వాతావరణం ప్రతిబింబించేలా ఈ రంగుల పనులు సాగాలి. దీనికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని పనులను వేగంగా కొనసాగించాలి” అని కమిషనర్ స్పష్టం చేశారు.
ఈ క్షేత్రస్థాయి పరిశీలన కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), సభ్యులు శ్రీ అవ్వారు శ్రీనివాసరావు, శ్రీ పి. రాఘవరాజు, డిప్యూటీ ఈవో శ్రీ కిషోర్ బాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీమతి ఎల్. రమాదేవి, అసిస్టెంట్ కమిషనర్ శ్రీ సిహెచ్. రంగారావు, దేవస్థాన ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.





