ప్రముఖ సినీనటుడు, రాజకీయ నాయకుడు బాబు మోహన్ జన్మదిన వేడుకలు నగరంలోని ప్లాజా హోటల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ వేడుకలకు ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి, మాజీ ఐఏఎస్ పార్థ సారథి, ప్రముఖ దర్శకుడు ఎస్.వి. కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి, దర్శకుడు రాలంగి నరసింహా రావు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ, హస్య నటుడు శివారెడ్డి హాజరయ్యారు. ఆయన బాబు మోహన్ ని గజమాలతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. కార్యక్రమం సందర్భంగా కేక్ కటింగ్ నిర్వహించగా, అభిమానులు ఆనందంతో కేకలు వేస్తూ సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా బాబు మోహన్ స్పందిస్తూ, తనపై చూపుతున్న అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. అభిమానులు, మిత్రులు, సహచరులు ఇచ్చే ప్రేమ, ఆదరణే నాకు బలమన్నారు. భవిష్యత్తులో ప్రజల సేవాకే పూర్తి సమయాన్ని కెటాయిస్తానన్నారు. తనకు ఇంత అభిమానాన్ని పంచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు మాట్లాడుతూ, బాబు మోహన్ సరళత, సహజత్వం తమను ఆకట్టుకుంటాయని చెప్పారు. ఆయన నటనలోనూ, వ్యక్తిత్వంలోనూ ఉన్న ప్రత్యేకతే ఆయనను ప్రజలకు దగ్గర చేసింది అని అభిప్రాయపడ్డారు. ఆయన సినీ రంగంలో తన ప్రత్యేక శైలితో ప్రేక్షకులను అలరించడమే కాకుండా, రాజకీయ రంగంలో కూడా ప్రజలకు సేవలందిస్తూ మంచి పేరు సంపాదించారని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రజల సమస్యలపై స్పందిస్తూ ఎప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారని తెలిపారు.
ఈ వేడుకలు కేవలం జన్మదిన వేడుకలుగా మాత్రమే కాకుండా, ఆయన చేసిన సేవలకు గౌరవార్థంగా నిర్వహించబడిన కార్యక్రమంగా నిలిచాయి. పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొనడం ద్వారా ఆయనకు ఉన్న ప్రజాదరణ మరోసారి స్పష్టమైంది.





