దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే దిశగా వెళ్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో దేశ ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా చూడని స్థాయిలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ముఖ్యంగా యువత, రైతులు, చిన్న వ్యాపారులు, మధ్యతరగతి వర్గాలపైనే ఈ ప్రభావం తీవ్రంగా పడుతుందని పేర్కొన్నారు. అయితే దేశంలోని పెద్ద కార్పొరేట్ సంస్థలు, అదానీ-అంబానీ వంటి పారిశ్రామిక వేత్తలపై మాత్రం పెద్దగా ప్రభావం ఉండదని వ్యాఖ్యానించారు.
రెండు రోజుల పర్యటనలో భాగంగా తన సొంత నియోజకవర్గమైన రాయ్బరేలీకి చేరుకున్న రాహుల్ గాంధీ స్థానిక మీడియాతో మాట్లాడారు. దేశ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకీ ఆందోళనకరంగా మారుతోందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలు సామాన్య ప్రజల జీవితాలను మరింత కష్టాల్లోకి నెట్టేస్తున్నాయని ఆరోపించారు. ఉద్యోగావకాశాలు తగ్గిపోవడం, వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉండటం, చిన్న వ్యాపారాలు నిలదొక్కుకోలేని పరిస్థితి నెలకొనడం వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు.
ప్రస్తుతం దేశంలో అసమానతలు పెరుగుతున్నాయని రాహుల్ గాంధీ విమర్శించారు. ఒకవైపు కొద్దిమంది కార్పొరేట్ సంస్థలు భారీ లాభాలు ఆర్జిస్తుండగా.. మరోవైపు సామాన్య ప్రజలు రోజువారీ ఖర్చులు కూడా భరించలేని పరిస్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. దేశ సంపద కొద్ది మంది చేతుల్లోనే కేంద్రీకృతమవుతోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ విధానాల వల్ల పేదలు మరింత పేదలుగా మారుతుండగా.. ధనికులు మరింత ధనవంతులవుతున్నారని విమర్శించారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రజలకు చేసిన పొదుపు సూచనలపైనా రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజలు ఖర్చులు తగ్గించుకోవాలని, విదేశీ పర్యటనలను తగ్గించాలని ప్రధాని సూచిస్తుంటే.. ఆయనే తరచూ విదేశీ పర్యటనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఒక విధమైన సందేశం ఇచ్చి.. తాను మరో విధంగా వ్యవహరించడం సరికాదన్నారు. దేశ ప్రజలు ఎదుర్కొంటున్న అసలు సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.
దేశ యువత పరిస్థితి అత్యంత దారుణంగా మారుతోందని రాహుల్ అన్నారు. చదువులు పూర్తిచేసుకున్న యువకులకు సరైన ఉద్యోగాలు లభించడం లేదని, నిరుద్యోగం చరిత్రలో ఎన్నడూ లేనంతగా పెరిగిందని పేర్కొన్నారు. చిన్న వ్యాపారులు జీఎస్టీ, పెరిగిన ధరలు, ఆర్థిక మందగమనం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రైతులు పంటలకు సరైన ధరలు లేక, అప్పుల భారం పెరిగి తీవ్ర ఆవేదనలో ఉన్నారని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ నేత విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదని పేర్కొన్నారు. పారిశ్రామిక వృద్ధి, ఉపాధి కల్పన, వ్యవసాయ అభివృద్ధి వంటి కీలక రంగాల్లో స్పష్టమైన ప్రణాళిక కనిపించడం లేదన్నారు.





