ఉత్తమ పాలసీల రూపకల్పనతోనే ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించగలుగుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సీయింగ్ ఈజ్ బిలీఫ్ అనే విధానంలో ఏపీకి ఒక్కసారి వచ్చి చూసి అప్పుడు పెట్టుబడులు పెట్టాలని ఆయన పారిశ్రామిక వేత్తలకు పిలుపునిచ్చారు. ఢిల్లీలోని తాజ్ ప్యాలస్ లో భారత పరిశ్రమల సమాఖ్య నిర్వహించిన యాన్యువల్ బిజినెస్ సమ్మిట్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరై ప్రసంగించారు.
దేశానికి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో ఏపీ 25 శాతం మేర పెట్టుబడులను ఆకర్షించగలిగిందని ఆయన వివరించారు. గడచిన 23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి వచ్చాయని.. తద్వారా 24 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయన్నారు. భవిష్యత్ అవసరాలను అంచనా వేసి ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ లాంటి సంస్థలతో కలిసి క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు. ఇప్పటికే క్వాంటం రిఫరెన్సు ఫెసిలిటీని కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
త్వరలో క్వాంటం కంప్యూటర్ కు అవసరమైన పరికరాలను కూడా ఉత్పత్తి చేసేలా కార్యాచరణ ప్రారంభించామని పారిశ్రామిక వేత్తలకు తెలియచేశారు. పారిశ్రామిక రంగానికి అనుకూలమైన రాష్ట్రంగా ఏపీలో ఎంఎస్ఎంఈలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేలా వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ అనే విధానాన్ని అమలు చేస్తున్నట్టు వివరించారు. ఏపీ ప్రజలు కూడా పరిశ్రమలు ఏర్పాటు చేయటంలో ఎప్పుడూ ముందు ఉంటారని అందుకే వారికి ఆంధ్రాప్రెన్యూర్స్ అనే పేరు వచ్చిందని అన్నారు.
సీఐఐ సంస్థ అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ ఏర్పాటుకు ముందుకు రావటం సంతోషదాయకమన్నారు. ఏపీలో క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్ , డ్రోన్స్ ఏరోస్పేస్, డిఫెన్స్ తదితర రంగాల పరిశ్రమల్ని పెట్టుబడుల్ని ఆకర్షించేలా వివిధ పాలసీలను అమలులోకి తెచ్చామని.. ఏపీలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం అని సీఎం పారిశ్రామిక వేత్తలకు పిలుపునిచ్చారు.
దేశంలో అమలు చేసిన ఆర్ధిక సంస్కరణలు మనకు అవకాశాలు తెచ్చిపెట్టాయని సీఎం వ్యాఖ్యానించారు. దేశ, రాష్ట్ర ప్రయోజనాలే తన అజెండా అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వివిధ రంగాల్లోని గ్లోబల్ ట్యాలెంట్ దేశ లక్ష్యాలు సాధించటంలో కీలకంగా మారుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ సుస్థిరమైన ప్రభుత్వాలు ఉన్నాయని ఆయన అన్నారు. పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో మంచి ఫలితాలు వచ్చాయని.. గతంలో ఆ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా ఉండేదని గత కొంతకాలంగా ఆ రాష్ట్రానికి అభివృద్ధి ఆలోచనలే లేకుండా పోయాయన్నారు. సంస్కరణల వాది అయిన ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ అగ్రస్థానానికి చేరుకుంటుందన్నారు.





