పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. ఈ సందర్భంగా పాయకరావుపేట పట్టణంలో రూ.61 లక్షల వ్యయంతో నిర్మించిన అన్నా క్యాంటీన్ను మంత్రి అనిత ప్రారంభించారు.
అనంతరం క్యాంటీన్లో భోజనాలను స్వయంగా వడ్డించి, స్థానిక ప్రజలతో కలిసి భోజనం చేశారు. భోజనాల నాణ్యతపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ, పేదవారికి మంచి భోజనం అందించడం అన్నా క్యాంటీన్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను రద్దు చేసి పేదలకు భోజనం దూరం చేసిందన్నారు. 2019–2024 మధ్య కాలంలో వాటిని రాజన్న క్యాంటీన్లుగా అయినా కొనసాగించాలని కోరినా స్పందన లేకపోయిందని అన్నారు.
ఎన్డీఏ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, పట్టణాలతో పాటు గ్రామీణ మండలాల్లో కూడా వీటిని విస్తరిస్తున్నామని చెప్పారు. పాయకరావుపేట నియోజకవర్గంలో నక్కపల్లి అడ్డరోడ్డు సమీపంలో మరో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పాయకరావుపేటలోని సరయ్య చెరువు వద్ద స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
‘జలం–జీవం’ నినాదంతో చెత్త తొలగింపు కార్యక్రమంలో స్వయంగా పాల్గొని, పారిశుద్ధ్య కార్మికులను సత్కరించారు. సరయ్య చెరువును అభివృద్ధి చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన ఆమె, చెరువును శుభ్రపరచి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని సూచించారు.





