కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖకు చెందిన డినోటిఫైడ్, సంచార, అర్ధసంచార జాతుల అభివృద్ధి, సంక్షేమ బోర్డు (జాతీయ డిఎన్టి బోర్డు) ఆధ్వర్యంలో సంచార, అర్థ సంచార జాతుల కొరకు చేపడుతున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా బోర్డు సభ్యులు భారత్భాయ్ బాబుభాయ్ పాట్ని, ప్రవీణ్ శివాజిరావ్ ఘుగే తెలంగాణలో వెనుకబడిన తరగతుల కమిషన్ కార్యాలయాన్ని సందర్శించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా కమిషన్ ఛైర్మన్ జి. నిరంజన్ సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాలలక్క్ష్మి రంగు గార్లతో బోర్డు సభ్యులు సమావేశమై కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న సీడ్ పథకంలో అర్హులను గుర్తించడానికి డిఎన్టి సర్టిఫికేట్ల జారీ గురించి చర్చించారు.
ఈ సందర్భంగా ఛైర్మన్ జి. నిరంజన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని డిఎన్టి, సంచార, అర్ధ`సంచార కులాలను సమగ్ర అధ్యయనం ద్వారా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం తర్వాత ఆయా కులాల వారికి డిఎన్టి సర్టిఫికేట్లు జారీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.
జాతీయ డిఎన్టి బోర్డు సభ్యులు మాట్లాడుతూ… దేశంలో ఇప్పటివరకు 7 రాష్ట్రాలలో మాత్రమే డిఎన్టి సర్టిఫికేట్లు జారీ చేస్తున్నారని, మిగతా రాష్ట్రాలలో కూడా డిఎన్టి సర్టిఫికేట్లు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్రాలను సందర్శించి, సంబంధిత అధికారులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలుచేస్తున్న ఈ పథకంలో విద్యార్థులు వివిధ ప్రవేశ పరీక్షలు, ఉద్యోగ సంబంధిత పరీక్షల కొరకు శిక్షణ పొందడానికి స్కాలర్షిప్లు మంజూరు చేస్తున్నట్టు, ఉపాధికల్పన, గృహ నిర్మాణం తదితర అంశాల కొరకు లబ్దిదారులకు ఆర్థిక సహాయం అందిచనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా వివిధ కుల సంఘాల నాయకులు జాతీయ డిఎన్టి బోర్డు సభ్యులను, రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్, సభ్యులను కలిసి రాష్ట్రంలో సాధ్యమయినంత త్వరగా ఈ పథకాన్ని ప్రారంభించాలని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అధికారులు డిప్యూటి డైరెక్టర్ యు. శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శి కె. మనోహర్ రావు, ప్రత్యేక అధికారి కుమారి ఎన్. సునీత, సెక్షన్ ఆఫీసర్ జి. సతీష్ కుమార్, రీసెర్చ్ ఆఫీసర్ జి. లక్క్ష్మీనారాయణ మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.





