మారిన మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మీడియాకు స్వయం నియంత్రణ అవసరమని వేగంగా సమాచారాన్ని చేరవేసేక్రమంలో పొరపాట్లకు ఎలాంటి ఆస్కారాన్ని ఇవ్వరాదని మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాసరెడ్డి తెలిపారు. వార్తల్లో వేగం, వ్యక్తిత్వ హననానికి దారితీయ కూడదని ఆయన సూచించారు.
సోషల్ మీడియా సమాజంపై ప్రభావం అనే అంశంపై టియూడబ్ల్యూజే ఐజేయు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక అక్షయ ఫంక్షన్ హాల్లో బుధవారం సెమినార్ నిర్వహించారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే రామ్నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సెమినార్లో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మీడియా రంగంలో అనేక విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని, సమాచారం పాఠకునికి అత్యంత వేగంగా చేరేవిధంగా ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిందన్నారు.
టెలీప్రింటర్, టెలీగ్రాఫ్, ఫాక్స్ స్థాయి నుండి సాంకేతికత క్రమంగా పెరుగుతూ వచ్చిందని తెలిపారు. దీనికితోడు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత సమాచారం నిమిషాల వ్యవధిలో ప్రజలకు చేరుకుందన్నారు. ఆ ఒరవడి నుండి ఇప్పుడు సామాజిక మాధ్యమాలు మరింత వేగంగా సమాచారాన్ని అందిస్తున్నాయన్నారు. ప్రింట్ మీడియాకు సంబంధించి వివిధ స్థాయిల్లో వార్తలను పరిశీలించి ఆతర్వాత తుదిరూపం ఇవ్వడం జరుగుతుందని, ఎలక్ట్రానిక్ మీడియాలోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు.
సామాజిక మాధ్యమంలో ఇది లేకపోవడంతో కొన్ని విపత్కర పరిస్థితులకు దారతీస్తుందన్నారు. వ్యక్తులుగా సామాజిక మాధ్యమాలను నిర్వర్తించడం తమ అభిప్రాయాలను వెల్లడించే క్రమంలో తమ అభిప్రాయాలను అనుమానాలను ఆలోచనలను ఇతరులపై రుద్దే ప్రయత్నం జరుగుతోందన్నారు. అందుకే సామాజిక మాధ్యమాలకు సంబంధించి స్వీయ నియంత్రణ పాటించాలని, ప్రెస్ కౌన్సిల్ఆఫ్ ఇండియాలో ప్రస్తుతానికి ఎలక్ట్రానిక్ మీడియా కూడా లేదని ఆయన తెలిపారు.
మీడియా సమాజోన్నతి, అభివృద్ధి హక్కుల పరిరక్షణే లక్ష్యంగా ముందుకు సాగాలని అభిప్రాయపడ్డారు. అనంతరం నూతన కమిటీల సన్మాన కార్యక్రమాలు నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సెమినార్లో ఐజేయు సెక్రెటరీ జనరల్ సోమసుందర్, పినపాక శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం శాసన సభ్యులు డా. తెల్లం వెంకట్రావు, యూనియన్ నాయకులు మాటేటి వేణుగోపాల్, నేషనల్ కౌన్సిల్ సభ్యలు బివి రమణారెడ్డి, జిల్లా అధ్యక్షులు జాగు వెంటరత్నం, ప్రధాన కార్యదర్శి జునుమాల రమేష్, జిల్లా, డివిజన్, పట్టణ కమిటీల బాధ్యులతో పాటు తదితరులు పాల్గొన్నారు.





