తెలంగాణ రాష్ట్రాన్ని వేధిస్తున్న తీవ్రమైన ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన విశ్వవిద్యాలయాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని డిగ్రీ, పీజీ కళాశాలలకు వేసవి సెలవులను మరికొన్ని రోజులు పొడిగిస్తున్నట్లు ప్రకటించాయి. వాస్తవానికి జూన్ 1 నుంచి విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం కావాల్సి ఉండగా, ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా తరగతుల ప్రారంభాన్ని వాయిదా వేస్తూ యూనివర్సిటీలు ప్రత్యేక సర్క్యులర్లు జారీ చేశాయి.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిని మించి నమోదవుతున్నాయి. ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో వడగాల్పులు తీవ్రంగా వీయడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని అధికారులు భావించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు కళాశాలలకు రాకపోకలు సాగించడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండటంతో సెలవులను పొడిగించాలని నిర్ణయించారు.
ఈ నిర్ణయం రాష్ట్రంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల పరిధిలోని అన్ని క్యాంపస్ కళాశాలలు, అనుబంధ డిగ్రీ మరియు పీజీ కళాశాలలకు వర్తించనుంది. ఉస్మానియా యునివర్సీటీ, పాలమూరు యునివర్సిటీ తెలంగాణ యునివర్సిటీ, కాకతియా యునివర్సిటీ, శాతవామన యునివర్సిటీ పరిధిలోని వేలాది మంది విద్యార్థులకు ఈ నిర్ణయం వర్తించనుంది.
ఉస్మానియా, పాలమూరు, తెలంగాణ విశ్వవిద్యాలయాలు జూన్ 6 వరకు వేసవి సెలవులను పొడిగిస్తున్నట్లు ప్రకటించాయి. జూన్ 7 ఆదివారం కావడంతో ఆయా యూనివర్సిటీల పరిధిలోని కళాశాలలు జూన్ 8 నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. దీంతో విద్యార్థులకు అదనంగా మరో వారం రోజుల విశ్రాంతి లభించనుంది.
కాకతీయ, శాతవాహన విశ్వవిద్యాలయాలు జూన్ 5 వరకు సెలవులను పొడిగించాయి. ఈ రెండు విశ్వవిద్యాలయాల పరిధిలోని కళాశాలలు జూన్ 6 నుంచే తరగతులను ప్రారంభించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. వాతావరణ పరిస్థితులను నిరంతరం పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వవిద్యాలయ వర్గాలు వెల్లడించాయి.
గత కొన్ని వారాలుగా తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. కొన్ని జిల్లాల్లో 42 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భారత వాతావరణ శాఖ కూడా పలు ప్రాంతాలకు వడగాల్పుల హెచ్చరికలు జారీ చేసింది. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు బయటకు రావడం వల్ల వడదెబ్బ, నీరసం, ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సెలవులను పొడిగించడం సరైన నిర్ణయమని తల్లిదండ్రులు కూడా అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి కళాశాలలకు ప్రయాణించే విద్యార్థులు అధిక ఎండల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉండటంతో ఈ నిర్ణయం ఉపశమనాన్ని కలిగించిందని చెబుతున్నారు.
ఈ సెలవులు కేవలం విద్యార్థులు, బోధనా సిబ్బందికి మాత్రమే వర్తిస్తాయని యూనివర్సిటీలు స్పష్టం చేశాయి. కళాశాలల ప్రిన్సిపాల్స్, పరిపాలనా విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది యథావిధిగా తమ విధులకు హాజరు కావాల్సి ఉంటుంది. విద్యా సంవత్సరానికి సంబంధించిన పరిపాలనా పనులు, అడ్మిషన్లు, పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రక్రియ వంటి కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతాయని పేర్కొన్నాయి.
విద్యాసంస్థలు తిరిగి ప్రారంభమయ్యే సమయానికి విద్యార్థులు తమ అకడమిక్ కార్యక్రమాలకు సిద్ధంగా ఉండాలని యూనివర్సిటీ అధికారులు సూచించారు. కొత్త సెమిస్టర్ తరగతులు, పరీక్షల షెడ్యూల్, ఇతర విద్యా కార్యక్రమాలపై సంబంధిత కళాశాలలు త్వరలోనే పూర్తి వివరాలు విడుదల చేయనున్నాయి.





