తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ ఉత్కంఠపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ తీవ్రంగా స్పందించారు. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇప్పటివరకు గవర్నర్ నుంచి ఆహ్వానం రాకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు.
ఈ పరిణామాలను ప్రజా తీర్పును అగౌరవపరచడంగా అభివర్ణించిన కమల్ హాసన్, ఇది తమిళనాడు రాష్ట్రానికి జరిగిన అవమానమని వ్యాఖ్యానించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ఆయన సుదీర్ఘ పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ పోస్టు తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
తన పోస్టులో కమల్ హాసన్ రాజ్యాంగబద్ధ వ్యవస్థల బాధ్యతను గుర్తుచేశారు. “తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో ప్రజలు ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి ఫలితం రావడం ఇదే తొలిసారి. అయినప్పటికీ ప్రజలు అత్యధిక స్థానాలు టీవీకే పార్టీకి ఇచ్చారు. కాబట్టి ప్రజా తీర్పును గౌరవించడం ప్రతి రాజ్యాంగ వ్యవస్థ బాధ్యత” అని ఆయన పేర్కొన్నారు.
అలాగే డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వైఖరిని కూడా కమల్ హాసన్ ప్రశంసించారు. “‘ప్రజల తీర్పును గౌరవిస్తాం.. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం’ అని నా సోదరుడు స్టాలిన్ ప్రకటించడం ఆయన రాజకీయ పరిపక్వతకు నిదర్శనం” అని కమల్ వ్యాఖ్యానించారు. రాజకీయ భేదాలు ఉన్నప్పటికీ ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో స్టాలిన్ చూపిన వైఖరి ప్రశంసనీయం అని అన్నారు.
రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు కూడా తమ బాధ్యతలను నిర్వర్తించాల్సిన అవసరం ఉందని కమల్ హాసన్ స్పష్టం చేశారు. “ఇది డిమాండ్ కాదు. వారి రాజ్యాంగపరమైన విధిని గుర్తుచేయడం మాత్రమే” అని ఆయన పేర్కొన్నారు. గవర్నర్ ఆలస్యం చేయకుండా రాజ్యాంగ సంప్రదాయాలను అనుసరించాలని పరోక్షంగా సూచించారు.
తమిళనాడులో ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు అంశం అత్యంత ఆసక్తికరంగా మారింది. టీవీకే పార్టీ 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచినా, స్పష్టమైన మెజారిటీకి మాత్రం ఇంకా దూరంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించినప్పటికీ, అవసరమైన మేజిక్ ఫిగర్కు ఇంకా కొంత సంఖ్య తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో గవర్నర్ తదుపరి నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
విజయ్ ఇప్పటికే రెండుసార్లు గవర్నర్ను కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వాలని కోరిన విషయం తెలిసిందే. సీపీఐ, వీసీకే, డీఎంకే వంటి పార్టీలు కూడా టీవీకేకు తొలి అవకాశం ఇవ్వాలని బహిరంగంగా అభిప్రాయపడ్డాయి. ఇప్పుడు కమల్ హాసన్ కూడా అదే తరహాలో స్పందించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
సోషల్ మీడియాలో కూడా కమల్ హాసన్ పోస్టుపై విస్తృత చర్చ జరుగుతోంది. చాలామంది ఆయన అభిప్రాయానికి మద్దతు తెలుపుతున్నారు. ప్రజాస్వామ్యంలో అతిపెద్ద పార్టీకి ముందుగా అవకాశం ఇవ్వడం రాజ్యాంగ సంప్రదాయమని నెటిజన్లు పేర్కొంటున్నారు.
తమిళనాడులో ఈసారి ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి తెరతీశాయి. సంప్రదాయ పార్టీలకు సవాల్ విసురుతూ విజయ్ పార్టీ సంచలన ఫలితాలు సాధించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటుపై జరుగుతున్న రాజకీయ పరిణామాలు మరింత ఉత్కంఠను పెంచుతున్నాయి.





