ఆరోగ్య సాంకేతిక పరిజ్ఞాన రంగంలో ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రానిక్స్ సంస్థ శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ మరో కీలక మైలురాయిని అధిగమించింది. ప్రపంచంలోనే తొలిసారిగా తమ శాంసంగ్ గలాక్సీ వాచ్ ద్వారా వాసోవేగల్ సిన్కోప్ (Vasovagal Syncope – VVS) అనే సమస్యను అత్యంత కచ్చితత్వంతో ముందుగానే గుర్తించగలమని సంస్థ ప్రకటించింది. ఈ సాంకేతికత ఆరోగ్య రంగంలో ముందడుగుగా భావిస్తున్నారు.
దక్షిణ కొరియాలోని చుంగ్-ఆంగ్ యూనివర్శిటీ గ్వాంగ్మయాంగ్ హాస్పిటల్తో కలిసి నిర్వహించిన క్లినికల్ అధ్యయనంలో ఈ విజయాన్ని సాధించినట్లు శాంసంగ్ మే 7న వెల్లడించింది. ఈ పరిశోధన ఫలితాలు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ‘యూరోపియన్ హార్ట్ జర్నల్ – డిజిటల్ హెల్త్’లో ప్రచురితమయ్యాయి. దీంతో గెలాక్సీ వాచ్ ఆరోగ్య పర్యవేక్షణలో మరింత విశ్వసనీయ పరికరంగా నిలిచే అవకాశం కనిపిస్తోంది.
వాసోవేగల్ సిన్కోప్ అనేది ఆకస్మికంగా కళ్లు తిరిగి స్పృహ కోల్పోయే పరిస్థితి. అధిక ఒత్తిడి, భయం, శారీరక అలసట లేదా ఇతర కారణాల వల్ల గుండె స్పందనల రేటు ఒక్కసారిగా తగ్గిపోవడం, రక్తపోటు పడిపోవడం జరుగుతుంది. దాంతో మెదడుకు తగినంత రక్తప్రసరణ అందక కొద్ది సేపు వ్యక్తి స్పృహ కోల్పోతాడు.
సాధారణంగా ఈ పరిస్థితి ప్రాణాంతకం కాకపోయినా, ఆకస్మికంగా కింద పడిపోవడం వల్ల తీవ్రమైన ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తలకు గాయాలు కావడం, ఎముకలు విరగడం, ప్రమాదకర పరిస్థితుల్లో పడిపోవడం వంటి ఘటనలు జరగొచ్చు. వైద్య నిపుణుల అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా జీవితకాలంలో దాదాపు 40 శాతం మంది ఈ సమస్యను కనీసం ఒక్కసారైనా ఎదుర్కొంటారు. వీరిలో మూడింట ఒక వంతు మందికి ఈ సమస్య పదేపదే పునరావృతమవుతుందని చెబుతున్నారు.
శాంసంగ్ అభివృద్ధి చేసిన ఈ సాంకేతికత గుండె స్పందనలు, రక్త ప్రసరణలో జరిగే మార్పులను నిరంతరం పరిశీలిస్తుంది. శరీరంలో సంభవించే అసాధారణ మార్పులను గుర్తించి, వాసోవేగల్ సిన్కోప్కు దారితీసే పరిస్థితిని ముందుగానే అంచనా వేయగలదని సంస్థ పేర్కొంది.
అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే.. వ్యక్తి స్పృహ కోల్పోయే ముందు హెచ్చరిక అందించడం. దీంతో బాధితుడు వెంటనే కూర్చోవడం లేదా సురక్షిత ప్రదేశానికి వెళ్లడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా వృద్ధులు, గుండె సంబంధిత సమస్యలున్నవారికి ఇది ఎంతో ఉపయోగకరంగా మారే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
చుంగ్-ఆంగ్ యూనివర్శిటీ గ్వాంగ్మయాంగ్ హాస్పిటల్తో కలిసి నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్లో గెలాక్సీ వాచ్ సాంకేతికత మంచి ఫలితాలను చూపించినట్లు సమాచారం. పరిశోధకులు పలువురు రోగులపై పరీక్షలు నిర్వహించి, వాసోవేగల్ సిన్కోప్కు ముందు శరీరంలో సంభవించే మార్పులను గెలాక్సీ వాచ్ విజయవంతంగా గుర్తించినట్లు వెల్లడించారు.
ఈ ఫలితాలను వైద్య ప్రపంచం సానుకూలంగా చూస్తోంది. స్మార్ట్వాచ్లను కేవలం ఫిట్నెస్ ట్రాకర్లుగానే కాకుండా ఆరోగ్య రక్షణ పరికరాలుగా కూడా ఉపయోగించే దిశగా ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు.
గత కొన్నేళ్లుగా స్మార్ట్వాచ్లు ఆరోగ్య పర్యవేక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. గుండె స్పందనలు, ఆక్సిజన్ స్థాయిలు, నిద్ర, ఒత్తిడి వంటి అంశాలను ఇప్పటికే ట్రాక్ చేస్తున్నాయి. ఇప్పుడు స్పృహ కోల్పోయే ప్రమాదాన్ని కూడా ముందే గుర్తించే స్థాయికి టెక్నాలజీ చేరుకోవడం విశేషమని విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వేర్బుల్ హెల్త్ డివైజ్ల వినియోగం పెరుగుతోంది. ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించడం ద్వారా ప్రాణాపాయ పరిస్థితులను తగ్గించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో శాంసంగ్ తాజా పరిశోధన ఆరోగ్య సాంకేతిక రంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలికినట్లుగా కనిపిస్తోంది.





