బెంగాల్ రాజకీయాల్లో ఎన్నికల వేడి రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ అంశం కొత్త రాజకీయ వాదోపవాదాలకు దారి తీసింది. పార్లమెంట్లో రాజ్యాంగ 131వ సవరణ బిల్లుకు అడ్డంకులు ఏర్పడిన నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు తారస్థాయికి చేరుకున్నాయి.
ఈ బిల్లుతో పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే లక్ష్యం ఉందని పేర్కొంటూ, దాని ఆమోదానికి ఆటంకం కలిగించడం మహిళా సాధికారతకు వ్యతిరేకమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో బెంగాల్లో జరిగిన భారీ ఎన్నికల సభలో నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో స్పందించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడంలో తృణమూల్ కాంగ్రెస్ కీలక పాత్ర పోషించిందని ఆరోపించారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తూ మహిళలకు న్యాయం జరగకుండా అడ్డుకట్ట వేసిందని విమర్శించారు.
మహిళల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచే ఈ చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించడం ప్రజలు గమనించారని తెలిపారు.బిష్ణుపుర్లో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడుతూ మోదీ, మహిళా ఓటర్లే రాబోయే ఎన్నికల్లో తమ తీర్పు ఇస్తారని అన్నారు. రాష్ట్రంలోని మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ, వారి భద్రత, అభివృద్ధి, ఆర్థిక స్వావలంబనపై దృష్టి పెట్టడం బీజేపీ విధానమని చెప్పారు.
మహిళలు రాజకీయాల్లోకి మరింతగా రావాలని, నిర్ణయాత్మక స్థానాల్లో ఉండాలని తమ లక్ష్యమని వివరించారు.మహిళా సాధికారతను అడ్డుకోవడమే కాకుండా, బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని టీఎంసీపై మోదీ ఆరోపించారు. చట్టాలను ఉల్లంఘిస్తూ కొంతమంది వర్గాలకు లబ్ధి చేకూర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. ఈ విధానాలు సమాజంలో విభేదాలకు దారి తీస్తాయని హెచ్చరించారు.గిరిజన అంశాలపై కూడా రాజకీయ వాగ్వాదం చెలరేగింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు తగిన గౌరవం ఇవ్వలేదని టీఎంసీపై మోదీ విమర్శలు గుప్పించారు.
గిరిజన వర్గాల సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా గిరిజనులకు ప్రాధాన్యం పెంచే చర్యలు తీసుకుంటున్నామని, కానీ బంగాల్లో ఆ దిశగా సరైన ప్రయత్నాలు కనిపించడం లేదని పేర్కొన్నారు.





