రాష్ట్ర రాజకీయ పరిణామాల్లో కీలక మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్న వేళ, రేవంత్ రెడ్డి గవర్నర్ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. పెండింగ్లో ఉన్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకాలపై తక్షణ నిర్ణయం తీసుకోవాలని శివప్రతాప్ శుక్లాను కోరారు.
ముఖ్యంగా ప్రొఫెసర్ కోదండరామ్, మహమ్మద్ అజారుద్దీన్ పేర్లను ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నియామకాలు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో రాజకీయంగా, రాజ్యాంగపరంగా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ప్రస్తుతం మంత్రివర్గంలో కొనసాగుతున్న మహమ్మద్ అజారుద్దీన్ పరిస్థితి ఈ అంశాన్ని మరింత కీలకంగా మార్చింది. ఆయన ఎలాంటి సభకు సభ్యుడు కాకుండానే మంత్రి పదవిలో కొనసాగుతున్నారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం, ఆరు నెలల్లోపు శాసనసభ లేదా శాసన మండలిలో సభ్యత్వం పొందాల్సి ఉంటుంది.
ఈ గడువు ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో, ఎమ్మెల్సీగా నియామకం జరగకపోతే మంత్రి పదవి కోల్పోయే పరిస్థితి ఏర్పడే అవకాశముంది. దీంతో ఈ అంశంపై ప్రభుత్వం అత్యవసరంగా చర్యలు తీసుకుంటోంది.ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం తరఫున గవర్నర్ను కలిసి పరిస్థితిని వివరించారు.
ఇప్పటికే ఉన్న సాంకేతిక అడ్డంకులు తొలగిపోయాయని, వెంటనే ఫైళ్లపై ఆమోద ముద్ర వేయాలని అభ్యర్థించారు. దీనికి ముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అడ్వకేట్ జనరల్ కూడా గవర్నర్ను కలిసి రాజ్యాంగపరమైన అంశాలపై వివరణ ఇచ్చినట్లు సమాచారం. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారి తీస్తున్నాయి.
ఈ భేటీ కేవలం రాజకీయ నియామకాలకే పరిమితం కాలేదు. రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన కీలక అంశాలు కూడా చర్చకు వచ్చాయి. రాష్ట్రంలో పెరుగుతున్న డ్రగ్స్ సమస్యపై ఆందోళన వ్యక్తం చేస్తూ, దాన్ని నిర్మూలించేందుకు సంయుక్త కార్యాచరణ అవసరమని అభిప్రాయం వ్యక్తమైంది.విద్యార్థులను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడటానికి కొత్త చర్యలను పరిశీలించారు.
విద్యాసంస్థల్లో అడ్మిషన్ సమయంలోనే విద్యార్థుల నుంచి మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రమాణ పత్రాలు తీసుకోవాలని గవర్నర్ సూచించారు. ఇది విద్యార్థుల్లో అవగాహన పెంచడమే కాకుండా, బాధ్యతను కూడా కలిగిస్తుందని భావిస్తున్నారు. విద్యాసంస్థల్లో నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.





