తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అయిన టీజీ ఆర్టీసీ లో సమ్మె సైరన్ మోగింది. ఈ నెల 22వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు వెళుతున్నట్లు ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ప్రకటించింది. ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
గత నెల 13వ తేదీన యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చినట్లు తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది.
నోటీసలు అందజేసీ నెల గడిచిపోయినా అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం, యాజమాన్యం ముందుకు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. 32 డిమాండ్లను యాజమాన్యం ముందు ఉంచినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా జేఏసీ వైస్ ఛైర్మన్ థామస్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని సమ్మెను నివారించే చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తే ఆందోళనలు మరింత ఉధృతం అవుతాయని హెచ్చరించారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె నుంచి వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు.
జేఏసీ ఉంచిన ప్రధాన డిమాండ్లలో ఒకటి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం. ఇది ఉద్యోగులకు భద్రత, స్థిరత్వం కలిగిస్తుందని వారు భావిస్తున్నారు. అదనంగా కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం, ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు ఇవ్వడం వంటి అంశాలను కూడా డిమాండ్ చేస్తున్నారు. పింఛన్, పదోన్నతులు, సేవా నియమావళి వంటి విషయాల్లో మార్పులు చేయాలని వారు కోరుతున్నారు.
ఈ సమ్మె జరిగితే రవాణా వ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడే అవకాశం ఉందని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బస్సు సేవలు నిలిచిపోతే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని, ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు రోజువారీ ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కావున ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం వెంటనే స్పందించాలని వారు సూచించారు.
గతంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురైన సందర్భాల్లో ప్రభుత్వం చర్చల ద్వారా పరిష్కారం కనుగొన్న ఉదాహరణలు ఉన్నాయి. ఈసారి కూడా చర్చల ద్వారానే సమస్య పరిష్కారం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు.





