కర్నూల్ జిల్లాలో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న చుక్కల భూములు, 22ఏ-1 నిషేధిత జాబితా భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తూ 111 మంది రైతులకు డీ-నోటిఫికేషన్ క్లియరెన్స్ పత్రాలను అందజేసినట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు.
శనివారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో రైతులకు ఈ పత్రాలను పంపిణీ చేశారు. జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, డిఆర్ఓ రాము నాయక్, ఆర్డీఓలు, మండల తాసిల్దార్ లు, రైతులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చుక్కల భూములు, 22 ఏ1 భూములు నిషేధిత జాబితాలో వుండి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించి 111 మంది రైతులకు డీనోటిఫై చేసిన క్లియరెన్స్ పత్రాలు అందజేస్తున్నామన్నారు. జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమానికి సుమారు 400 మంది ప్రజలు హాజరవుతుండగా, అందులో 90 శాతం సమస్యలు భూములకు సంబంధించినవేనని తెలిపారు.
ముఖ్యంగా ఆన్లైన్ రికార్డుల్లో పేర్లు నమోదు కాకపోవడం, తప్పుగా ఇతరుల పేర్లు నమోదు కావడం వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. తహసీల్దార్లు రికార్డింగ్ అధికారులుగా మాత్రమే వ్యవహరిస్తారని, భూమి యాజమాన్యాన్ని నిర్ణయించే అధికారం వారికి లేదని స్పష్టం చేశారు. నిజమైన హక్కుదారుల పేర్లను రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయడం వారి బాధ్యత అని వివరించారు. జిల్లాలో భూవివాదాలకు ప్రధాన కారణాలు కుటుంబ తగాదాలు, ప్రభుత్వ భూములపై అక్రమ క్రయవిక్రయాలు అని కలెక్టర్ పేర్కొన్నారు.
అసైన్డ్ భూములను అక్రమంగా కొనుగోలు చేయడం, అమ్మడం వంటి చర్యలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని, ఇప్పటికే బనగానపల్లిలో జరిగిన ఇలాంటి అక్రమ విక్రయాలను రద్దు చేసినట్లు తెలిపారు. వాగులు, వంకలు, చెరువులు వంటి ప్రకృతి వనరులు సామాజిక ఆస్తి అని, వాటిని ఆక్రమించకుండా సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.
బ్రిటీష్ కాలంలో సర్వే సమయంలో పట్టాదారు వివరాలు లేని భూములకు ‘చుక్కలు’ గుర్తులు పెట్టడం వల్ల ఈ సమస్యలు ఉత్పన్నమయ్యాయని కలెక్టర్ వివరించారు. ఈ భూములను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం 2017లో డాటెడ్ ల్యాండ్స్ రెగ్యులరైజేషన్ చట్టాన్ని తీసుకువచ్చిందని తెలిపారు.
ఈ చట్టం ప్రకారం 2005కు ముందు నుంచి సాగులో ఉన్న లేదా అధీనంలో ఉన్న భూములను గుర్తించి అర్హులకు పట్టాదారు హక్కులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన ప్రత్యేక కమిటీ ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తోందని వివరించారు.పెండింగ్ కేసులకు వేగవంత పరిష్కారం





