నిత్యం ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ మానవీయ కోణంలో పరిష్కరిస్తూ అర్హులైన వారందరికి రాష్ట్ర ప్రభుత్వం అందించే అభివృద్ది, సంక్షేమ పథకాలు అందేలా అధికారులు కృషి చేయాలని ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక జిల్లా ప్రత్యేక అధికారి వికాస్ రాజ్ ఐఎఎస్ అన్నారు.
గురువారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ మను చౌదరి, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కోటిరెడ్డి లతో కలిసి జిల్లా ప్రత్యేక అధికారి వికాస్ రాజ్, ఐఎఎస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు జిల్లా కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, విజయేందర్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలను అర్హులందరికీ అమలు చేయడమే కాక ప్రజల సమస్యలను గుర్తించి సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని జిల్లా ప్రత్యేక అధికారి, రోడ్లు మరియు భవనాల శాఖ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, వికాస్ రాజ్ అన్నారు.
99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా వార్డు సభల నిర్వహణతో కిందిస్థాయి నుంచి కూడా ప్రజల సమస్యలను గుర్తించడమే కాక ప్రభుత్వ సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులు గురించి ఆయా శాఖల అధికారులు వివరించడం జరిగిందన్నారు. ప్రభుత్వం రూపొందించి 10 థీములతో కూడిన కార్యక్రమాల షెడ్యూల్ ప్రకారం ఆయా శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలు విజయవంతం కావడం జరిగిందని పేర్కొన్నారు.
వివిధ శాఖల్లో గుర్తించిన సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించుకుంటూ ముందుకెళ్లాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును నిరంతర ప్రక్రియగా పేర్కొంటూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక స్ఫూర్తిని భవిష్యత్తులోనూ కొనసాగించాలని సూచించారు. కొన్ని అంశాలలో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. ప్రతి శాఖలో ఏమైనా సమస్యలను గుర్తించి వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే కాక ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు 99 రోజుల యాక్షన్ ప్లాన్ దోహద పడిందన్నారు.
ఈ వర్షాకాలంలో నీరు నిలువ ఉండే ప్రాంతాలను ముందుగానే గుర్తించి తీసుకున్న కార్యాచరణ ప్రణాళికల పై సైబరాబాదు, మల్కాజిగిరి అడిషనల్ కమీషనర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏలాంటి ప్రమాదాలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రత్యేక అధికారి ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగిందన్నారు. మార్చి ఆరవ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో పాత ఫైల్స్ క్లియరెన్స్, పరిశుభ్రత కార్యక్రమాలను నిర్వహించామన్నారు. 99 రోజుల షెడ్యూల్ ప్రకారం వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల గురించి తెలియజేశారు.
బాల్యవివాహాలతో బతుకు ఆగం అనే నినాదంతో జిల్లాలో బాల్యవివాహాల నిర్మూలనకు కృషి చేస్తున్నామన్నారు. పోక్సో కేసులను తగ్గించేందుకు కట్టుదిట్టమైన చర్యలను చేపట్టామన్నారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో అర్రైవ్ అలైవ్ వారోత్సవాల్లో బ్లాక్ స్పాట్స్ గుర్తించి వాటిని మరమ్మత్తులు చేపట్టడం, రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనల పై జిల్లా వ్యాప్తంగా ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, అదనపు కలెక్టర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు, మునిసిపల్ కమిషనర్లు మరియు తదితరులు పాల్గొన్నారు.





