వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అధికారులు కొనుగోలు కేంద్రాలను నిరంతరం సందర్శిస్తూ సమగ్ర పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు.
సోమవారం హైదరాబాద్ నుంచి మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మణ్ కుమార్ మరియు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, అకాల వర్షాల ప్రభావం నేపథ్యంలో వరి ధాన్యం కొనుగోలు అంశంపై సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యం వల్ల రైతులు ఇబ్బందులు పడకుండా కొనుగోలు కేంద్రాల వద్ద ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి, రైతుల ఖాతాల్లో సకాలంలో చెల్లింపులు జమయ్యేలా చర్యలు తీసుకోవాలని, కొనుగోలు ప్రక్రియను ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా నిర్వహించాలని ఆదేశించారు.
కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అనంతరం సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయా శాఖల అధికారులు కొనుగోలు కేంద్రాలను తరచూ సందర్శించి పరిస్థితులను సమీక్షిస్తూ నివేదికలు సమర్పించాలని తెలిపారు. రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే వివరాలను ఓపీఎంఎస్ (Online Procurement Management System)లో నమోదు చేసి, వారికి సకాలంలో చెల్లింపులు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అకాల వర్షాల నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో తగిన సదుపాయాలు కల్పించి, ధాన్యం రక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, శాఖల మధ్య సమన్వయం పెంచి పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలని సూచించారు. సరైన ప్రణాళికతో కొనుగోలు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ మాధురి, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి, డి.ఆర్.డి.ఓ, డి.సి.ఓ మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.





