మానవ అక్రమ రవాణా, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “ఆపరేషన్ ట్రేస్” ద్వారా ఇప్పటివరకు 900 మంది పిల్లలను రక్షించామని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించిన ఒకరోజు ప్రత్యేక వర్క్షాప్లో ఆమె ఈ వివరాలు వెల్లడించారు.
మానవ అక్రమ రవాణా, బానిస కార్మిక వ్యవస్థ (రద్దు) చట్టం అమలుపై ఈ శిక్షణ కార్యక్రమం జరిగింది.ఈ వర్క్షాప్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 200 మంది ప్రాసిక్యూషన్ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో చట్టాలు, న్యాయవ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని అన్నారు. పోలీసులు, న్యాయవ్యవస్థ సమన్వయంతో పనిచేస్తే న్యాయం త్వరగా అందుతుందని ఆమె పేర్కొన్నారు. నేరాల నియంత్రణలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
ఆపరేషన్ ట్రేస్ కేవలం రాష్ట్రంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఫలితాలు ఇచ్చిందని మంత్రి తెలిపారు. వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన సుమారు 180 మందిని సురక్షితంగా రప్పించామని వెల్లడించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ సమర్థతకు నిదర్శనమని ఆమె పేర్కొన్నారు.
పిల్లల రక్షణ, మానవ అక్రమ రవాణా నిరోధం ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యాల్లో ఒకటని స్పష్టం చేశారు.పోక్సో చట్టం అమలుపై కూడా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని హోంమంత్రి తెలిపారు. కొన్ని కేసుల్లో నిందితులకు బెయిల్ రాకముందే శిక్షలు ఖరారవుతున్నాయని చెప్పారు. బాలలపై జరిగే నేరాలను ఏ మాత్రం ఉపేక్షించబోమని ఆమె స్పష్టం చేశారు.
ఇలాంటి కేసుల్లో త్వరితగతిన విచారణ పూర్తిచేయడమే లక్ష్యమని పేర్కొన్నారు.బెయిల్ వ్యవహారాలపై కూడా ఆమె విమర్శలు చేశారు. గతంలో జరిగిన రాజకీయ ఒప్పందాల వల్లే జగన్కు బెయిల్ లభించిందని ఆరోపించారు. తన సోదరి షర్మిలను కూడా పక్కన పెట్టడం ఆయన తీరును చూపిస్తుందని అన్నారు.





