హాలీవుడ్ ప్రముఖ సిరీస్ ఫ్రెండ్స్ ఫేమ్ నటుడు మాథ్యూ పెర్రీ మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా భావించిన భారత సంతతికి చెందిన జస్వీన్ సంఘాకు అమెరికా కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష విధించడం అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది.
‘కెటమైన్ క్వీన్’గా పేరుపొందిన జాస్వీన్ సంఘా హాలీవుడ్ ప్రముఖులకు మాదకద్రవ్యాలను సరఫరా చేస్తూ పెద్ద నెట్వర్క్ నడిపినట్లు అమెరికా దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. దీంతో ఈమే ప్రధాన నిందితురాలిగా తేల్చారు. అంతేకాదు. ఈ సమయంలోనే ఆమె పేరుమార్చుకున్నారని తెలిపారు.
బ్రిటిష్-అమెరికన్ పౌరసత్వం కలిగిన జస్వీన్ సంఘా లాస్ ఏంజెలెస్లోని నగరంలోని తన విలాసవంతమైన అపార్ట్మెంట్ నుంచే డ్రగ్స్ వ్యాపారాన్ని నిర్వహించేదని ఆమె ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కెటమైన్ వంటి మాదకద్రవ్యాలు సరఫరా అవుతున్నాయని అధికారులు కోర్టుకు వివరించారు.
2023లో మాథ్యూ పెర్రీ తన ఇంట్లోని హాట్ టబ్లో అపస్మారక స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మరణం మొదట సహజ కారణాలతో జరిగినట్లు భావించినప్పటికీ, తర్వాతి దర్యాప్తులో డ్రగ్స్ వినియోగం ప్రధాన కారణమని తేలింది. ముఖ్యంగా కెటమైన్ అనే శక్తివంతమైన మాదకద్రవ్యాన్ని అధిక మోతాదులో తీసుకోవడం వల్లే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు నిర్ధారించారు.
పెర్రీ మరణానికి ముందు నెల రోజుల్లో జస్వీన్ సంఘా సుమారు 51 కెటమైన్ వయల్స్ను ఎరిక్ ఫ్లెమింగ్ అనే వ్యక్తి ద్వారా అతడి వ్యక్తిగత సహాయకుడికి చేరవేసింది. ఈ వ్యవహారం పూర్తిగా ఒక నెట్వర్క్ ద్వారా నడిచిందని, ఇందులో పలువురు వ్యక్తులు భాగస్వాములుగా ఉన్నారని అధికారులు తెలిపారు.
ఈ కేసులో ఎరిక్ ఫ్లెమింగ్ పాత్ర కూడా కీలకంగా నిలిచింది. అతడు మధ్యవర్తిగా వ్యవహరిస్తూ డ్రగ్స్ సరఫరాను నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
జస్వీన్ సంఘా కోర్టు విచారణలో తన తప్పును అంగీకరించినట్లు సమాచారం. మాదకద్రవ్యాల సరఫరా వల్ల ఒక ప్రముఖ నటుడి ప్రాణాలు కోల్పోవడం తీవ్ర నేరమని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ఆమెకు 15 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ అమెరికా కోర్టు ఆదేశించింది.
దీంతో హాలీవుడ్లో డ్రగ్స్ వినియోగంపై మరోసారి చర్చ మొదలైంది. ప్రముఖులు మాదకద్రవ్యాలకు బానిసలవడం, వాటి ప్రభావం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన స్పష్టంగా చూపించింది. మాథ్యూ పెర్రీ అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఈ కేసులో వచ్చిన తీర్పును స్వాగతిస్తున్నారు. ఈ తీర్పులో తమ అభిమాన నటుడికి న్యాయం జరిగిందని వారు భావిస్తున్నారు.హాలీవుడ్ నటుడి మృతి కేసు.. భారత సంతతి మహిళ ‘కెటమైన్ క్వీన్’కు 15 ఏళ్ల జైలు శిక్ష





