తెలంగాణ రాజకీయాల్లో ఆరోపణలు, ప్రతిఆరోపణలు మరింత ఉధృతంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్ తన ఉనికిని కోల్పోయిందని, బీజేపీకి ప్రజల్లో స్థానం లేదని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు కాంగ్రెస్పైనే విశ్వాసం ఉంచుతున్నారని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు దీనికి నిదర్శనమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు.
బీఆర్ఎస్ పరిస్థితిపై స్పందిస్తూ, ఆ పార్టీ పతనం ప్రారంభమైందని మహేశ్ గౌడ్ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వేరు కుంపటి పెట్టుకోవడం వల్ల పార్టీ పరిస్థితి దిగజారిందని అన్నారు. అలాగే కేటీఆర్ మరియు హరీశ్ రావు మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందని ఆరోపించారు. ఈ అంతర్గత కలహాల వల్ల పార్టీ బలహీనపడిందని పేర్కొన్నారు.మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయాలకు దూరమై, కేవలం తన ఫామ్హౌస్కే పరిమితమయ్యారని ఆయన ఎద్దేవా చేశారు. దీంతో పార్టీకి నాయకత్వ లోటు ఏర్పడిందని వ్యాఖ్యానించారు.
బీజేపీపై కూడా మహేశ్ గౌడ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఆ పార్టీ దేవుడి పేరును ఉపయోగించి ఓట్లు అడుగుతోందని, ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. అందుకే రాష్ట్రంలో బీజేపీకి ప్రజలు దూరం పెడుతున్నారని వ్యాఖ్యానించారు.ఇక కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుపై విశ్వాసం వ్యక్తం చేస్తూ, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో 100 సీట్లు గెలుచుకోవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.
ప్రస్తుతం తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకుంటూ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అన్ని పార్టీలు తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి.





