నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ జనసేన నాయకుడు సాగర్ తీవ్రస్థాయిలో స్పందించారు. జనసేన పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురించి వ్యాఖ్యానించే హక్కు ప్రకాశ్ రాజ్కు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. పార్టీ అంతర్గత వ్యవహారాలు, రాజకీయ వ్యూహాలపై అనవసర వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన అన్నారు.
మీడియాతో మాట్లాడిన సాగర్, జనసేన భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. “జనసేన పార్టీ ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేస్తుందా? లేక ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటుందా? అనేది పూర్తిగా పార్టీ నాయకత్వం నిర్ణయించే అంశం. దానిపై ప్రకాశ్ రాజ్ ఎందుకు మాట్లాడాలి?” అని ప్రశ్నించారు.
“అసలు ప్రకాశ్ రాజ్ ఎవరు? మా పార్టీ నిర్ణయాల గురించి మేమెందుకు ఆయనకు సమాధానం చెప్పాలి?” అంటూ సాగర్ ఘాటుగా స్పందించారు. రాజకీయ పార్టీగా జనసేన తన నిర్ణయాలను ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తీసుకుంటుందని, బయట వ్యక్తులు వాటిపై వ్యాఖ్యానించడం అనవసరమని పేర్కొన్నారు.
ప్రకాశ్ రాజ్ తరచూ రాజకీయ అంశాలపై స్పందిస్తూ వివాదాలకు కేంద్రబిందువుగా మారుతున్నారని సాగర్ ఆరోపించారు. “ప్రశాంతంగా ఉన్నవారిని కెలకడం ప్రకాశ్ రాజ్కు అలవాటుగా మారింది. ఏదో ఒక అంశంపై వ్యాఖ్యలు చేసి వివాదాలు సృష్టించడం ఆయనకు కొత్త కాదు” అని విమర్శించారు.
జనసేన పార్టీపై, పవన్ కల్యాణ్పై ఎవరైనా విమర్శలు చేయవచ్చని, అయితే వాస్తవాలు తెలుసుకోకుండా చేసే వ్యాఖ్యలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉందని అన్నారు. పవన్ కల్యాణ్ ప్రజా సమస్యల పరిష్కారానికి, రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్న నాయకుడని పేర్కొన్నారు.
ఇటీవల రాజకీయ అంశాలపై ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారి తీసిన నేపథ్యంలో సాగర్ ఈ విధంగా స్పందించినట్లు తెలుస్తోంది. దీంతో మరోసారి రాజకీయ, సినీ వర్గాల్లో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
జనసేన శ్రేణులు కూడా ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాయని సాగర్ తెలిపారు. పార్టీపై విమర్శలు చేసే ముందు వాస్తవాలను తెలుసుకోవాలని, రాజకీయ నిర్ణయాలపై వ్యాఖ్యానించేటప్పుడు బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.





