అమెరికా–ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు వెలువడ్డాయి. భారత్లోని ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహీ సంచలన వ్వాఖ్యాలు చేశారు. అమెరికా యుద్ధాన్ని కొనసాగించే స్థితిలో లేకపోవడంతోనే కాల్పుల విరమణ ప్రకటించిందన్నారు. ఇది అమెరికా స్వచ్ఛంద నిర్ణయం కాదని, తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయమని స్పష్టం చేశారు.
అమెరికా యుద్ధాన్ని కొనసాగించలేకపోయిందని, మరిన్ని నష్టాలు తప్పవని గ్రహించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చిందన్నారు. గత కొన్ని రోజులుగా యుద్ధం కొనసాగుతున్నప్పటికీ, దాన్ని ఆపేందుకు అమెరికా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయన్నారు. ఓటమి తప్పదని గ్రహించి కాల్పుల విరమణకు ముందుకొచ్చిందని వ్యాఖ్యానించారు.
శాంతి నెలకొనాలంటే ఇరాన్ పెట్టే షరతులను అమెరికా అంగీకరించాల్సిందేనని ఆయన హెచ్చరించారు. లేకపోతే భవిష్యత్తులో మళ్లీ ఘర్షణలు తలెత్తే అవకాశం ఉందని సూచించారు.
ఇరాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోలేదని, తమపై బలవంతంగా ఈ ఘర్షణను రుద్దారని హకీమ్ ఇలాహీ తెలిపారు. ఈ యుద్ధంలో అమాయక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొవటం
తమకు ఇష్టం లేదని, అంతర్జాతీయ నిబంధనలు, మానవతా విలువలను పాటించడమే తమకు ఇష్టమన్నారు.
ఇదే క్రమంలో తమపై దాడులు కొనసాగితే మాత్రం గట్టిగా ప్రతిస్పందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. అమెరికా కూడా ఈ విషయాన్ని గ్రహించిందన్నారు.
ప్రస్తుతం అమెరికా–ఇరాన్ మధ్య ప్రకటించిన కాల్పుల విరమణ తాత్కాలికమే అయినప్పటికీ, భవిష్యత్తులో ఇది శాశ్వత శాంతికి దారి తీస్తుందా లేదా అన్నది అనిశ్చితంగా ఉంది. ఇరాన్ ప్రతినిధి వ్యాఖ్యలు ఈ విరమణ వెనుక ఉన్న రాజకీయ, సైనిక పరిస్థితులను ప్రతిబింబిస్తున్నాయి.





