దేశంలో వేగంగా మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ తగ్గిపోవడం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు తాజా ఆరోగ్య గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జాతీయ నమూనా రిజిస్ట్రేషన్ వ్యవస్థ (SRS), జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-6) విడుదల చేసిన నివేదికలు దేశ ఆరోగ్య రంగానికి సంబంధించిన పలు కీలక విషయాలను వెలుగులోకి తెచ్చాయి. ముఖ్యంగా గుండె జబ్బులు, క్యాన్సర్, శ్వాసకోశ వ్యాధులు వంటి అసాంక్రమిక వ్యాధులు (NCDs) దేశంలో మరణాలకు ప్రధాన కారణాలుగా మారినట్లు నివేదికలు పేర్కొన్నాయి.
సర్వే గణాంకాల ప్రకారం, ప్రస్తుతం దేశంలో సంభవిస్తున్న మొత్తం మరణాల్లో 60 శాతానికి పైగా అసాంక్రమిక వ్యాధుల వల్లే జరుగుతున్నాయి. ఒకప్పుడు అంటువ్యాధులు, పోషకాహార లోపాలు ప్రధాన ఆరోగ్య సమస్యలుగా ఉండగా, ఇప్పుడు జీవనశైలి సంబంధిత వ్యాధులు ఆరోగ్య వ్యవస్థకు పెద్ద సవాల్గా మారుతున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ సమస్య వేగంగా విస్తరిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నివేదికలో అత్యంత ఆందోళన కలిగించే అంశం గుండె జబ్బుల కారణంగా నమోదవుతున్న మరణాల సంఖ్య. అసాంక్రమిక వ్యాధుల వల్ల జరిగే మరణాల్లో ఏకంగా 32.1 శాతం గుండె సంబంధిత వ్యాధుల వల్లనే సంభవిస్తున్నట్లు వెల్లడైంది. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ పెరగడం, వ్యాయామం లేకపోవడం, మానసిక ఒత్తిడి వంటి కారణాలు ఈ పరిస్థితికి దారితీస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అలాగే దేశంలో మధుమేహం (డయాబెటిస్) మరియు ఊబకాయం సమస్యలు కూడా ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నట్లు సర్వేలో వెల్లడైంది. ప్రస్తుతం పురుషుల్లో మధుమేహం బారిన పడిన వారి శాతం 20.9కి చేరగా, మహిళల్లో ఇది 17.8 శాతంగా నమోదైంది. గతంతో పోలిస్తే ఈ సంఖ్యలు గణనీయంగా పెరగడం ఆరోగ్య రంగాన్ని కలవరపెడుతోంది. ముఖ్యంగా యువతలో కూడా మధుమేహం కేసులు పెరుగుతుండటం నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది.
ఆధునిక జీవనశైలిలో ఫాస్ట్ ఫుడ్ వినియోగం, శారీరక చలనం తగ్గిపోవడం, ఎక్కువసేపు కూర్చునే ఉద్యోగాలు, నిద్రలేమి వంటి అంశాలు ఊబకాయం మరియు మధుమేహానికి ప్రధాన కారణాలుగా గుర్తిస్తున్నారు. వీటి ప్రభావం గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, ఇతర దీర్ఘకాలిక అనారోగ్యాలకు దారితీస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
యువతలో మానసిక ఆరోగ్య పరిస్థితి కూడా ఆందోళనకరంగా మారుతున్నట్లు నివేదిక పేర్కొంది. 15 నుంచి 29 ఏళ్ల వయస్సు గల యువతలో ఆత్మహత్యల కారణంగా మరణాల శాతం 19కు చేరడం కలచివేసే అంశంగా మారింది. విద్య, ఉద్యోగాలు, ఆర్థిక ఒత్తిళ్లు, సామాజిక సమస్యలు, మానసిక ఆందోళనలు యువతపై ప్రభావం చూపుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మానసిక ఆరోగ్యంపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.
మహిళలు ఆర్థికంగా ముందడుగు వేస్తున్నప్పటికీ బాల్యవివాహాలు, గృహహింస వంటి సామాజిక రుగ్మతలు ఇంకా కొనసాగుతూన్నాయన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటికీ 20 శాతం బాల్య వివాహాలు జరుగుతుండగా, 22.3 శాతం మంది మహిళలు భర్తల నుంచి గృహహింసను ఎదుర్కొంటున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణలోనే అత్యధికంగా 30.8 శాతం మంది మహిళలు గృహహింస బాధితులుగా ఉన్నట్లు సర్వేలో తేలింది.





