తెలంగాణలో రైతుల రుణమాఫీ అమలు విషయంలో వివాదం మరింత ముదురుతోంది. అర్హులైన రైతులకు రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలు కావట్లేదని ఆరోపిస్తూ మాజీ మంత్రి హరీశ్రావు హైకోర్టును ఆశ్రయించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. సిద్ధిపేట నియోజకవర్గానికి చెందిన వేలాది మంది రైతులు రుణమాఫీ నుంచి బయటపడ్డారని ఆయన తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు.
హరీశ్రావు దాఖలు చేసిన పిటిషన్లో ముఖ్యంగా సిద్ధిపేట నియోజకవర్గంలోని సుమారు 23 వేల మంది రైతులకు ఇప్పటికీ రుణమాఫీ కాలేదని పేర్కొన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో అమలులో లోపాల వల్ల అర్హులైన రైతులు ప్రయోజనం పొందలేకపోతున్నారని ఆయన న్యాయవాది వాదించారు. రుణమాఫీ అమలు కాకపోవడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మానసిక ఆవేదనకు గురవుతున్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా రైతుల తరఫునే హరీశ్రావు ఈ పిటిషన్ను దాఖలు చేసినట్లు న్యాయవాది తెలిపారు. రైతుల సమస్యను తక్షణమే పరిష్కరించేందుకు కోర్టు జోక్యం అవసరమని విన్నవించారు. అయితే ప్రభుత్వ తరఫున వాదించిన ప్రభుత్వ న్యాయవాది (జీపీ) ఈ అంశం ప్రజాప్రయోజనానికి సంబంధించినదని, వ్యక్తిగత పిటిషన్ కంటే ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL)గా దాఖలు చేయడం సముచితమని అభిప్రాయపడ్డారు.
ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇది వ్యక్తిగత సమస్య కాదని, ప్రజల సమస్య కాబట్టి ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో కోర్టు సూచన మేరకు హరీశ్రావు తన పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. త్వరలోనే ఈ అంశంపై పిల్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.





